శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (11:50 IST)

మైక్‌లో భక్తి గీతాలు పెట్టాడనీ అర్చకుడిని కొట్టి చంపేశారు...

ఓ అర్చకుడుని కొట్టి చంపేశారు. వేకువజామున మైక్‌లో భక్తి గీతాలు పెట్టినందుకు ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
వరంగల్‌ పోచమ్మ మైదాన్‌ కూడలిలో శ్రీ శివసాయి మందిరం వుంది. ఇక్కడ అర్చకుడుగా దేవళ్ల సత్యనారాయణ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ప్రతి రోజూ ఉదయాన్నే ఆలయానికి వచ్చిన గుడి తలపులు తెరిచి భక్తిగీతాలు పెట్టేవారు. అలా గత అక్టోబరు నెల 26వ తేదీన ఎప్పటిలాగానే ఉదయం 5.30 గంటలకు ఆలయ మైక్‌లో భక్తి పాటలు పెట్టి గుడిలో హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. 
 
అయితే మైక్‌ ఆపాలంటూ మరో మతానికి చెందిన యువకుడు అర్చకుడితో వాగ్వాదానికి దిగాడు. మైక్‌ ఆపేందుకు నిరాకరించడంతో దాడికి దిగాడు. వృద్ధుడని కూడా చూడకుండా ముఖం, వీపు, కడుపులో పిడుగుద్దులు కురిపించడంతో పూజారి కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలతో రోదిస్తున్న అర్చకుడు దేవళ్ల సత్యనారాయణను బంధువులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు షిఫ్ట్‌ చేశారు. 
 
అయితే చికిత్స పొందుతూ పూజారి దేవళ్ల సత్యనారాయణ మరణించడంతో పటిష్ట బందోబస్తు మధ్య మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. అర్చకుడి సొంతూరు మొగిలిచర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందిడుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఉద్దేశపూర్వక దాడి, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.