1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (10:40 IST)

పొరపాటు జరగలేదు.. అచ్యుతానందను మావోలు కావాలనే చంపారు..

చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా ఆరాన్‌పూర్‌లో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో దూరదర్శన్‌ కెమెరామెన్‌తో పాటు ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దంతెవాడలో ఎన్నికల ప్రచారాన్ని కవర్‌ చేయడానికి దూరదర్శన్‌ బృందంతో వెళ్తోన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు.


ఈ దాడిలో సబ్ ఇన్‌స్పెక్టర్ రుద్ర ప్రతాప్, అసిస్టెంట్ కానిస్టేబుల్ మంగళు, ఢిల్లీకి చెందిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద సాహు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
 
ఈ ఘటనపై మావోలు స్పందించారు. మీడియా ఎప్పటికీ తమ లక్ష్యం కాదంటూ చేతి రాతతో కూడిన ఓ లేఖను విడుదల చేశారు. ఆకస్మిక దాడిలో అచ్యుతానంద మృతి చెందారు తప్పితే అతడిని చంపాలన్నది తమ ఉద్దేశం కాదని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు లేఖపై దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ స్పందించారు. మావోలు చెప్తున్న దాంట్లో ఏమాత్రం నిజం లేదన్నారు. 
 
మీడియాను లక్ష్యంగా చేసుకునే అచ్యుతానందను హతమార్చినట్టు చెప్పారు. ఇప్పుడేమో పొరపాటు జరిగిందని చెబుతున్నారని ఫైర్ అయ్యారు.  మొదట కొన్ని నిమిషాలు ఏం జరిగిందో చెప్పాలనే ఉద్దేశంతోనే కెమెరాన్ అక్కడి దృశ్యాలను చిత్రీకరించేందుకు వెళ్లినట్టు తెలిపారు. నక్సల్స్ దాడిలో అచ్యుత్ శరీరంలోకి బోలెడన్ని తూటాలు దూసుకెళ్లాయని.. ఇదెలా తప్పిదం అవుతుందని ఎదురు ప్రశ్న వేశారు. ఇది ముమ్మాటికీ తప్పిదం కాదని పల్లవ్ తేల్చి చెప్పారు. అచ్చుత్‌ను చంపిన అనంతరం నక్సల్స్ అతడి కెమెరాను ఎత్తుకెళ్లారని వెల్లడించారు.
 
కాగా.. సీఆర్‌పీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగిన సమయంలో మరో డీడీ ఉద్యోగి మోర్ముకుట్ శర్మ నేలపై పడుకుని తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశారు. ఇవే తనకు ఆకరి క్షణాలని తన తల్లికి చెబుతూ వీడియో రికార్డ్ చేశారు. 
 
అయితే ఆయన ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కానీ, నక్సల్స్ దాడి చేస్తున్న సమయంలో శర్మ తీసిన వీడియో వైరల్ అయ్యింది. చివరి క్షణాల్లో ఆయన ధైర్యంగా వీడియోను రికార్డు చేసి.. అమ్మపై వున్న ప్రేమను వ్యక్తపరచడంపై నెటిజన్లు ఆయన ధైర్యాన్ని కొనియాడుతున్నారు.