1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 17 ఆగస్టు 2020 (21:31 IST)

కాక పుట్టిస్తున్న ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్ వ్యాఖ్యలు

తెలుగురాష్ట్రాలో రాజమౌళి నిర్మించే ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్ సినిమా విశేషాలు కన్నా నరసాపురం ఎంపీ ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్ (రఘురామకృష్ణమరాజు) మాటల తూటాలు నేడు కాక పుట్టిస్తున్నాయి. ప్రతిరోజూ రచ్చబండ పేరుతో మీడియా ముందుకు వస్తున్న ఈయన తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం మరోమారు మీడియా ముందుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.ఆర్డీఏలో ఆర్ 5 జోన్ పైన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చీటికీమాటికీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడం ద్వారా ప్రయోజనం ఉండదు అని, పెద్దపెద్ద లాయర్లకు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అని విమర్శించారు.
 
రాజధాని తరలింపు, సి.ఆర్.డి.ఏ చట్టం మార్పు అంశంపై సుప్రీంకోర్టులో బుధవారం జరిగే విచారణ కూడా రైతులకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను అన్నారు. పార్టీకి చెడ్డపేరు రావద్దని నేను ఇచ్చే సలహాలు నచ్చని వారు ఇప్పటికీ నాపై బెదిరింపులకు పాల్పడుతునే ఉన్నారు.
 
తాను ఫిర్యాదు చేసినప్పటికీ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదు అని, దేవేందర్ రెడ్డి ఇంకా నన్ను విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు అని అతనిపై చర్యలు తీసుకోకపోతే ఇదే విషయాన్ని తను పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు ట్రిపుల్ ఆర్.ఆర్.ఆర్.