1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YS Jagan Press Meet LIVE

చంద్రబాబే విలన్.. మావిగన్ ఎజెండాతో ఎన్నికల బరిలో దిగుతాం.. జగన్మోహన్ రెడ్డి

Jagan
Jagan
వైకాపా చీఫ్, విపక్ష నేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలోని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రాకముందు ఏపీలో ప్రజా సంక్షేమంపై చర్చ జరిగేదని మాజీ సీఎం జగన్ తెలిపారు. కానీ ప్రస్తుతం అరాచకాలు పెచ్చరిల్లిపోయాయని తెలిపారు. ఏపీలో రెడ్‌బుక్‌ అరాచకం, కస్టోడియల్‌ డెత్స్‌, హామీల మోసాలపై చర్చ జరుగుతోందని.. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా పక్కకు పోయిందని, పోలీసు స్టేషన్‌లకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులున్నాయని జగన్ అన్నారు.
 
ఏపీకి చంద్రబాబే అసలు విలన్ అని, సినిమాల్లోని విలన్ల పనులు ఆయన కళ్ల ముందే జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. అమరావతిలో రైతుల తరఫున నిలబడితే తమను నిందితులుగా చిత్రీకరిస్తున్నారని, తమ పార్టీ నేతలపైనే దాడి చేసి, తమపైనే కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. పోలీసుల సమక్షంలోనే తమపై రాళ్లతో దాడి చేశారని, కార్ల అద్దాలు పగలగొట్టారని జగన్ ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తే అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
 
ఇకపోతే.. వచ్చే ఎన్నికల్లో మావిగన్ అజెండాతోనే ముందుకు వెళ్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. ఈ విధానానికి కట్టుబడి ఉంటామని, తమకు మద్దతు ఇచ్చేవారు తమకే ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఎవరెవరు వచ్చినా కలిసి పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
About Writer
సెల్వి