1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Delhi EV 2.0 policy to take effect from July 1

Delhi EV Policy 2026: జూలై 1 నుంచి అమలులోకి ఢిల్లీ ఈవీ పాలసీ 2026

Delhi EV Policy 2026
Delhi EV Policy 2026
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఈవీ పాలసీ 2026కు తమ కేబినెట్ ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోమవారం ప్రకటించారు. ఈ కొత్త విధానం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చి, 2030 మార్చి 31 వరకు కొనసాగే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
 
ఈ పాలసీ ద్వారా రాబోయే నాలుగేళ్లలో పౌరులకు సుమారు రూ. 15,000 కోట్ల ప్రయోజనాలు చేకూరుతాయని సీఎం వివరించారు. ఇందులో భాగంగా, ప్రభుత్వం నేరుగా రూ. 7,000 కోట్లను ఛార్జింగ్ స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయనుంది. మరో రూ. 8,000 కోట్లను పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాల రూపంలో ఈవీ వినియోగదారులకు అందిస్తుంది. 
 
లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు ఆమోదం తర్వాత ఈ పాలసీ అధికారికంగా అమల్లోకి వస్తుంది. 
ఈ కొత్త పాలసీలో భాగంగా, 2027 జనవరి 1వ తేదీ నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్ లేదా సీఎస్ఓ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా నిషేధిస్తారు. ఆ తర్వాత కేవలం ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే అనుమతి ఉంటుంది. 
 
అదేవిధంగా, 2028 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పెట్రోల్, సీఎసీ టూవీలర్ల రిజిస్ట్రేషన్లను కూడా నిలిపివేయనున్నారు.
కొత్త విధానం ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి 100 శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 
 
కార్ల విషయానికొస్తే, రూ.30 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధర ఉన్న వాహనాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, కార్లు, తేలికపాటి గూడ్స్ ట్రక్కులు, గ్రామీణ సేవా వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలకు ఈ పాలసీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
సాధారణ వాహనాలకు, ఎలక్ట్రిక్ వాహనాలకు మధ్య ధర వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ రాయితీలు రూపొందించినట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. కాలుష్య రహిత, స్వచ్ఛమైన రవాణా రాజధానిగా ఢిల్లీని మార్చడమే ఈ పాలసీ ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హోమ్‌స్టేలో ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద స్థితి... హత్యనా, ఆత్మహత్యనా?