రైలు టిక్కెట్ల రద్దు, రీఫండ్ విధానంలో కీలక మార్పులు.. ఏంటవి?
భారతీయ రైల్వే ప్రయాణికులకు ఓ ముఖ్య సూచన చేసింది. రైల్వే టిక్టెల్ రద్దు, రీఫండ్ విధానంలో కీలకమైన మార్పులు చేసినట్టు పేర్కొంది. ఈ మార్పులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కొత్త నిబంధనల మేరకు రైలు బయలుదేరడానికి 8 గంటల లోపు కన్ఫర్మ్ టిక్కెట్ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రీఫండ్ లభించదు. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది.
ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్య టిక్కెట్ను రద్దు చేస్తే టిక్కెట్ ధరలో 50 శాతం మాత్రమే తిరిగి ఇస్తారు. అలాగే, 24 గంటల నుంచి 72 గంటల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం కోత విధించింది. 75 శాతం మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. ఒకవేళ ప్రయాణానికి 72 గంటలు ముందు అంటే మూడు రోజుల ముందు టిక్కెట్ రద్దు చేసుకుంటే కేవలం సాధారణ రద్దు చార్జీలు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది.
టిక్కెట్ ఏజెంట్లు, దళారులు పెద్ద సంఖ్యలో టిక్కెట్లను బ్లాక్ చేసి చివరి నిమిషంలో రద్దు చేయడాన్ని అరికట్టేందుకు వీలుగా ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు చివరి నిమిషంలో కూడా బెర్తులు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా దశలవారీగా అమలుకానుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.