గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా.. అమెరికా - ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇపుడు గల్ఫ్ దేశాలను వణికిస్తున్నాయి. అమెరికా మిత్ర దేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలపై ఇజ్రాయెల్ వరుస బాంబు దాడులు చేస్తూ ఆ దేశాలను వణికిస్తోంది. ఫలితంగా దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియాలు ఉలికిపాటుకు గురయ్యాయి. ఈ దేశాల్లో ఇరాన్ వైమానిక దాడులతో భయానక వాతావరణం నెలకొంది.
దుబాయ్, అబుదాబి, దోహాతో పాటు పలు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ తన పొరుగు దేశాలపై దాడులను తీవ్రతరం చేయడంతో గల్ఫ్ ప్రాంతం ఉలిక్కిపడింది. ఇప్పటివరకు సైనిక స్థావరాలపై దాడులకే పరిమితమైన ఇరాన్... ఇప్పుడు వ్యూహం మార్చింది. తాజాగా పౌర నివాసాలు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్పై దాడులు చేస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య పరస్పర దాడులు కొనసాగుతుండగా, ఇరాన్ తన దాడులను ముమ్మరం చేయడం యుద్ధ మేఘాలను మరింత ముదురుస్తోంది.
బహ్రెయిన్లో రాత్రిపూట భారీ శబ్దాలు, సైరన్ల మోతతో ప్రజలు నిద్రలేచారు. ఇక్కడ ఉన్న అమెరికా నేవీ ఫిఫ్త్ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తొలుత దాడులు ప్రారంభించినట్లు కనిపించినా, ఆ తర్వాత లక్ష్యాలను మార్చుకుంది. గల్ఫ్ దేశాల సంపదకు చిహ్నాలుగా ఉన్న ఎత్తైన నివాస భవనాలు, లగ్జరీ హోటళ్లు, ఆధునిక విమానాశ్రయ టెర్మినల్స్పై కూడా ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ దాడులను తిప్పికొట్టేందుకు ఆయా దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.
కువైట్లోని అమెరికా వైమానిక స్థావరం సమీపంలో ఒక యుద్ధ విమానం కూలిపోయినట్లు సిఎన్ఎన్ జియోలొకేట్ చేసిన వీడియో ద్వారా వెల్లడైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా తమ భూభాగంపై చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులను ముమ్మరం చేసింది. వాషింగ్టన్తో తాము ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. మరోవైపు, కువైట్లో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన నేపథ్యంలో, మరింత ప్రాణనష్టం సంభవించే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు.