గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (20:01 IST)

పరీక్షలు రద్దు చేసి సర్టిఫికేట్లు ఇవ్వడమంటే ఎలా? యూజీసీ

జాతీయ విపత్తు నిర్వహణ చట్టం పేరుతో డిగ్రీ పరీక్షలను రద్దు చేయడాన్ని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ తీవ్రంగా తప్పుబట్టింది. పరీక్షలు రద్దు చేసి సర్టిఫికేట్లు ఇవ్వమంటే ఎలా అని యూజీసీ ప్రశ్నిస్తోంది. 
 
కరోనా వైరస్ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు డిగ్రీ పరీక్షలు రద్దు చేశారు. పైగా, డిగ్రీ చేసే విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల పరిధిలో పరీక్షలను రద్దు చేసి, ఆపై సర్టిఫికెట్లను ఇవ్వాలని తమను కోరడాన్ని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ తప్పుపట్టింది. 
 
డిగ్రీలను ప్రదానం చేయడానికి సంబంధించిన నియమాలు, నిబంధనలను రూపొందించే అధికారం తమకు మాత్రమే ఉందని, దీన్ని రాష్ట్రాలు మార్చలేవని సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించింది. సెప్టెంబర్ 30 లోపల చివరి సంవత్సరం ఫలితాలు నిర్వహించాల్సిందేనని తేల్చింది.
 
యూజీసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, పలు ప్రాంతాలకు చెందిన 31 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాషణ్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించింది. 
 
యూజీసీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ విషయంలో రాష్ట్రాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నాయని,  విద్యార్థుల డిగ్రీలను గుర్తించకపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు.
 
విద్యార్థులు తమ చదువును కొనసాగించాలని, పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉండాలని, పరీక్షలు జరిపించకుండా డిగ్రీలను ఇచ్చే అవకాశాలే లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం, యూజీసీ ఆదేశాలను విపత్తు చట్టం అధిగమించగలదా? అని ప్రశ్నించింది. దీనికి 14వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.