శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 మే 2020 (14:47 IST)

ఆంధ్రాలో మరో 44 మందికి కరోనా... వీడని కోయంబేడు భయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 44 మందికి కరోనా వైరస్ సోకింది. గత 24 గంటల్లో 10240 శాంపిళ్ళను పరీక్షించగా, ఇందులో 44 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
సమయంలో 41 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,671 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 767 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,848 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 56కి చేరింది.
 
కరోనా జోరు.. అధికారులు బేజారు... 
దేశంలో కరోనా జోరుకు ఏమాత్రం అడ్డూఅదుపు లేకుండా పోతోంది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఆయా రాష్ట్రాల అధికారులు బేజారైపోతున్నారు. ఫలితంగా గత 24 గంటల్లో ఏకంగా 6977 కేసులు నమోదయ్యాయి. 
 
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు... గత 24 గంటల్లో దేశంలో 6,977 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదేసమయంలో 154 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇకపోతే, దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,38,845కి చేరగా, మృతుల సంఖ్య 4,021కి చేరుకుంది. 77,103 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కరోనా నుంచి ఇప్పటివరకు 57,720 మంది కోలుకున్నారు.
 
కోలుకుంటున్న న్యూయార్క్ 
మరోవైపు, అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగరం క్రమంగా కోలుకుంటోంది. ఈ నగరంలో కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు, వందల్లో మరణాలతో న్యూయార్క్ అతలాకుతలమైంది. 
 
అమెరికా దేశం మొత్తమ్మీద ఈ మహానగరంలోనే అత్యధిక కేసులు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు అక్కడ 1.97 లక్షల మందికి కరోనా సోకగా, 16,149 మంది మృత్యువాత పడ్డారు. అయితే, ఇప్పుడక్కడ పరిస్థితి క్రమంగా కుదుట పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
 
చాలా రోజుల తర్వాత న్యూయార్క్ నగరంలో మృతుల సంఖ్య వందలోపు నమోదయ్యాయి. ఇవాళ కనిష్టంగా 84 మంది చనిపోయారు. ఏప్రిల్ 8న ఏకంగా 799 మంది మరణించడం న్యూయార్క్ నగర చరిత్రలో ఓ రికార్డుగా నిలిచిపోయింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఏ రోజూ 100 మరణాలకు తగ్గిందిలేదు. కానీ, తొలిసారి ఈ రోజు కేవలం 84 మంది మాత్రమే చనిపోయారు.