1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:50 IST)

ఛత్తీస్‌గఢ్‌లో కొత్తరకం వేరియంట్.. పేరేంటో తెలుసా? ఎన్-440 రకం

దేశంలో కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా చెలరేగిపోతున్న వేళ ఛత్తీస్‌గఢ్‌లో కొత్తరకం వేరియంట్ వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఐదు వేర్వేరు నమూనాలను పరిశీలించిన అనంతరం ఈ వేరియంట్‌ను నిర్ధారించారు.
 
రోగులపై ఈ వేరియంట్ ఏమేరకు ప్రభావం చూపిస్తుందన్న విషయంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌కు N-440గా నామకరణం చేశారు. మనుషుల్లోని రోగ నిరోధకశక్తిని ఇది బలహీనం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
 
ఎన్-440 రకం వైరస్‌ ఉనికిని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల నిర్ధారించినట్టు చత్తీస్‌గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్‌దేవ్ తెలిపారు. అయితే, ఇది ప్రాణాంతకం కాదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బ్రిటిష్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 
 
కాగా, బుధవారం రాష్ట్రంలో కొత్తగా 4,563 కేసులు నమోదయ్యాయి. వైరస్ వెలుగుచూసిన రాష్ట్రంలో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని అధికారులు తెలిపారు. అలాగే, నిన్న 39 మంది కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,170కి పెరిగింది.