గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (22:12 IST)

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిచేసిన కేంద్రం - బస్సులు నడపమన్న సీఎం జగన్

కరోనా వైరస్ బారినపడుకుండా ఉండాలంటే ఏకైక మంత్రం ముఖానికి మాస్క్ ధరించడమే. ముఖానికి మాస్క్ ధరిస్తే కరోనా వైరస్ బారినపడకుండా తప్పించుకోవచ్చని కేంద్రం చెబుతోంది. అందుకే ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో కేంద్రం మాస్కు ధరించడంపై కీలక మార్గదర్శకాలు వెల్లడించింది. సింగిల్‌గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు, సైక్లింగ్ చేసేటప్పుడు మాస్కు అవసరంలేదని స్పష్టంచేసింది. అయితే వాహనంలో ఒకరికంటే ఎక్కువమంది ఉన్నప్పుడు, జిమ్‌లో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం మాస్కు వేసుకోవాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
 
మరోవైపు, కరోనా నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఆగిపోయాయి. ఇప్పటివరకు సర్వీసులు ఇంకా పునఃప్రారంభం కాలేదు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ... బస్సుల సంఖ్యకు సంబంధించి తుది నిర్ణయానికి రాలేకపోయారు.
 
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలను జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను తిప్పేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణకు ఆర్టీసీ బస్సులను నడిపే అంశాన్ని జగన్ దృష్టికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని తీసుకెళ్లారు.
 
దీనిపై జగన్ స్పందిస్తూ, బస్సులను తిప్పేందుకు అవసరమైతే న్యాయ సలహాను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో సగం సీట్లను మాత్రమే నింపి బస్సులను నడపాలని సూచించారు. 
 
సీటు-సీటుకు మధ్య ఒక సీటును కచ్చితంగా ఖాళీగా వదలాలని, ప్రయాణికుల మధ్య భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేయాలని... బస్టాండ్ లో దిగగానే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు.