1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:31 IST)

జమ్మూ కాశ్మీర్‌కు కరోనా రోగులను ఎక్స్‌పోర్ట్ చేస్తున్న పాకిస్థాన్: డీజీపీ

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా.. అద్భుతమైన పర్యాటక ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌ను కూడా వదలిపెట్టలేదు. జమ్మూకశ్మీర్‌లో 400 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో 50మంది ఈ వైరస్‌ బారినపడ్డట్లు అధికారులు వెల్లడించారు.

పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 10,513 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 224 మంది మృత్యువాత పడ్డారు. కేవలం బుధవారం మాత్రం 742 కేసులు నిర్ధారణ అయినట్లు పాక్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక్కడ పాకిస్థాన్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే? కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులను భారత్‌కు తరలించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని జమ్మూకాశ్మీర్‌ డీజీపీ తెలపడమే.

కాశ్మీర్‌లోయలో ఈ తరహా ప్రయత్నాలు పాకిస్థాన్ చేస్తోందని దిల్ బాగ్ తెలిపారు. శ్రీనగర్‌కు 20కి.మీ దూరంలో ఉన్న గాందెర్‌బాల్‌ జిల్లాలో కొవిడ్‌-19 క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఉగ్రవాదులను తరలిస్తున్న పాకిస్థాన్‌, తాజాగా కరోనా రోగులను కాశ్మీర్‌లోకి చేరవేస్తోందని మండిపడ్డారు. 
 
కాశ్మీర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చేసేందుకే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. ముఖ్యంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించామని దిల్ బాగ్ వెల్లడించారు. ఈ పరిణామాలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయని.. ఈ సమయంలో మనమంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కచ్చితమైన నిఘా సమాచారం ఉందని గతవారమే భారత సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణే ప్రకటించిన విషయం తెలిసిందే.