1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 5 ఆగస్టు 2021 (14:44 IST)

ఏపీలో లాక్‌డౌన్ వైపు అడుగులు? కంటైన్మెంట్ జోన్లు!!

క‌రోనా మూడో వేవ్ ముంచుకొస్తోంది. దీనికి అనుగుణంగా కేసులు పెరుగుతుండ‌టంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌ళ్లీ  లాక్ డౌన్ వైపు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే చిత్తూరు, గుంటూరు,నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వచ్చేశాయి.

మధ్యాహ్నం వరకే కొన్ని చోట్ల వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వరకే పర్మిషన్ ఇస్తున్నారు. క‌రోనా ప్రారంభ‌మైన త‌ర్వాత‌... సెకండ్ వేవ్ ప్రారంభంలో ఎలా జరిగిందో... ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనపడుతోంది. 
 
క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తోంది. రాత్రి 9 గంటల వరకే షాపులు, 10 గంటల వరకు జన సంచారానికి అనుమతి ఉంది. అయితే గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా మరికొన్ని గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటోంది.  గుంటూరు నగరంలోని బ్రాడీపేట సహా ఇతర ప్రాంతాల్లో కొన్ని చోట్ల కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గిపోలేదా..? లేక థర్డ్ వేవ్ మొదలైందా అనే సంశయం ఉండగానే.. అనుకోకుండా లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి రావడం విశేషం.         
 
ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఎక్కడికక్కడ అధికారులే చొరవ తీసుకుని నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. స్థానిక నాయకులతో చర్చించి కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తున్నారు. అందరూ మాస్క్ లు ధరించండి, శానిటైజర్ వాడండి, సామాజిక దూరం పాటించండి అని చెబుతున్నా ప్రయోజనం క‌నిపించ‌డంలేదు. మాస్క్ పెట్టుకోని వారికి జరిమానా విధిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో మ‌ళ్ళీ లాక్ డౌన్ తరహా ఆంక్షలే కరోనా కట్టడికి మేలు అని అధికారులు భావిస్తున్నారు.