గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (11:06 IST)

దెబ్బకు దెబ్బ... దాయాదిని చిత్తు చేసిన భారత్ - భువనేశ్వర్ అద్ఫుత రికార్డు

Team India
Team India
దుబాయ్ వేదికగా ఆసియా క్రికెట్ కప్ టోర్నీ జరుగుతోంది. ఇందులోభాగంగా, ఆదివారం రాత్రి చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ విజయంలో భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించడమే కాకుండా, సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన భువి.. 26 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను నేలకూల్చాడు. ఇప్పటివరకు పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సాధించాడు. 
 
పైగా, ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శన ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. ప్రత్యర్థి జట్టుకు చెందిన మొత్తం 10 వికెట్లనూ నేలకూల్చారు. ఇందులో భువి పాకిస్థాన్ జట్టుపై తన కెరీర్ బెస్ట్ నమోదు చేయగా, హార్దిక్ పాండ్యా కూడా కీలకమైన మూడు వికెట్లు పడగొట్టడమే కాకుండా 17 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 33 పరుగులు చేసి జట్టును విజయతీరానికి చేర్చాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 
 
హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం 
 
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి దాయాదుల పోరు జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో భారత్ విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 19.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత 148 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. భారత జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికో ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులేమి చేయకుండా తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు వికెట్ నష్టానికి ఒక్క పరుగు మాత్రమే. 
 
ఆ తర్వాత ఓపెన్ర్, కెప్టెన్ రోహిత్ శర్మతో జతకలిసిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు. అయితే, రెండో వికెట్ రూపంలో రోహిత్ శర్మ 12 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు రెండు వికెట్లకు 50 పరుగులు. రోహిత్ - కోహ్లీలు కలిసిన 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 
 
రోహిత్ ఔట్ అయిన తర్వాత కోహ్లీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేక పోయాడు. ఫలితంగా 34 బంతుల్లో మూడు ఫోర్లు ఓ సిక్సర్ సాయంతో 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. పిమ్మట రవీంద్ర జేడాజా, సూర్య కుమార్ యాదవ్‌లు జట్టు స్కోరును 89 పరుగుల వద్దకు చేరిన తరుణంలో సూర్యకుమార్ 18 పరుగులు చేసి వికెట్ పారసుకున్నాడు. 
 
అయితే, అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న రవీంద్ర జడేజా 35 పరుగుల వద్ద ఔట్ అయినప్పటికీ దినేష్ కార్తీక్‌తో కలిసి హార్దిక్ పాండ్యా (33 నాటౌట్) జట్టును విజయతీరానికి చేర్చాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఫలితంగా 20 ఓవర్లలో 148 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‍పై విజయభేరీ మోగించింది. 
 
రాణించిన భారత బౌలర్లు.. 
 
అంతకుముందు ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు తలవంచారు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 19.5 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి పాకిస్థాన్ జట్టు 147 పరుగులు చేసింది. 
 
పాక్ ఆటగాళ్లలో ఓపెనర్‌గా దిగిన రిజ్వాన్ 43, బాబర్ అజమ్ 11, ఫక్తర్ జమాన్ 10, ఇఫ్తీకర్ అహ్మద్ 28, ఖుషిదిల్ షా 2, షదబ్ ఖాన్ 10, అసిఫ్ అలీ 9, మహ్మద్ నవాజ్ 1, హరీస్ రౌఫ్ 13, నజీం షా 0, షహ్‌నవాజ్ దహానీ 16 చొప్పున పరుగులు చేయగా, అదనంగా 5 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఆ తర్వాత 148 పరుగుల విజయలక్ష్యంతో భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. 
 
అంతకుముందు టాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, టాస్ కీలకమని తాము భావించడంలేదని, నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ఈ మ్యాచ్ బరిలో దిగుతున్నామన్నాడు. గతంలో ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో రాణించామని, పిచ్ సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నాడు. ఈ మ్యాచ్‌కు రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడం బాధాకరమన్నాడు. 
 
అలాగే, పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్ మాట్లాడుతూ, తాము టాస్ గెలిచినా గానీ మొదట బౌలింగే తీసుకునేవాళ్లమని వెల్లడించాడు. ఇప్పుడు తాము మొదట బ్యాటింగ్ చేస్తున్నందున భారీ స్కోరు సాధించడంపై దృష్టి సారిస్తామన్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం తాము ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతున్నామని వివరించాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా టీ20 అరంగేట్రం చేస్తున్నాడని బాబర్ అజామ్ వెల్లడించాడు. 
 
ఇరు జట్ల వివరాలు..
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యజువేంద్ర చహల్, అర్షదీప్ సింగ్.
 
పాకిస్థాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, కుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షానవాజ్ దహానీ.