కాలేజీ ప్రిన్సిపాల్ను విద్యార్థులే చంపేశారా? పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు?
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీకి చెందిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.రూపారెడ్డి ఈ నెల 11వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను కాలేజీ విద్యార్థులే చంపేశారన్న అనుమానంతో పలువురు విద్యార్థుల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులోని మిస్టరీని ఛేదించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ బృందాలు సుమారు 80 మంది విద్యార్థులను పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరివద్ద జరిపిన విచారణలో కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
అలాగే, తమకు అనుమానం ఉన్న ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రూపారెడ్డిని హత్య చేసిన తర్వాత ఆమె నివాసం నుంచి రూ4 లక్షల వరకు చోరీ చేసినట్టు పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మరింతగా లోతుగా విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
