1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (23:31 IST)

ఆమె అనవసరంగా తన భర్తను హత్య చేసింది, ప్రియుడు వాంగ్మూలం

అక్రమ సంబంధం ఎన్నో జీవితాలను నాశనం చేస్తోంది. ప్రియుడి మోజులో పడి వివాహితలు ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రియుడితోనే జీవితకాలం కలిసి ఉండాలనుకున్న వివాహిత ఏకంగా భర్తను చంపేసింది.

 
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన కళిశెట్టి వెంకటరమణకు రామభద్రాపురం మండలం కొండపాలవసలకు చెందిన లలితకుమారికి 2015సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఐదేళ్ళ బాబు, ఏడాదిన్నర పాప కూడా ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ బాగానే ఉంటున్నారు.

 
అయితే ఈ మధ్య కాలంలో వెంకటరమణ తాగుడుకు బానిసయ్యాడు. ఇంటికి తరచూ తాగిరావడం గొడవ చేయడంతో వివాహిత లలితకుమారి మనస్థాపానికి గురైంది. ఎన్నిసార్లు భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 

 
దీంతో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. భర్త ఇంటి పట్టున లేకుండా తాగడం తిరగడం చేసేవాడు. ఈ క్రమంలో నరసింహారావు అనే యువకుడు లలితకు పరిచయమయ్యాడు. పనీపాట లేని ఆ యువకుడు ఎప్పుడూ లలితతోనే పిచ్చాపాటీ మాట్లాడుతూ ఉండేవాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

 
ప్రియుడి మాయమాటలు విన్న లలిత అతనితోనే జీవితకాలం కలిసి ఉండాలనుకుంది. భర్తను చంపేద్దామని ప్లాన్ చేసింది. బాగా తాగి నిద్రిస్తున్న భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. 

 
కానీ బంధువుల ఫిర్యాదుతో పోస్టుమార్టం చేస్తే అసలు విషయం బయటపడింది. దీంతో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత భర్త హత్యకు తాను ఎలాంటి ప్లాన్ చేయలేదని.. ఆమే అనవసరంగా తన భర్తను చంపేసిందని ప్రియుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.