1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 అక్టోబరు 2021 (11:05 IST)

ఇంటి వద్ద దింపుతామని నమ్మించి మహిళపై అత్యాచారం..

ఓ మహిళను నమ్మించిన ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి వద్ద దింపుతామని నమ్మపలికి ఈ దారుణానికి తెగబడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ ఏరియాలో జరిగింది. 
 
పురానాపూల్‌ ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల వివాహిత సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉండటంతో హైదర్‌గూడలోని కల్లు కంపౌండ్‌కు వచ్చి కల్లు తాగి ఇంటికి తిరిగి వెళ్ళేది.
 
ఇందులోభాగంగానే ఈ నెల 13న హైదర్‌గూడ కంపౌండ్‌కు వచ్చింది. ఇదేసమయంలో కూకట్‌పల్లి వివేక్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ నర్సింగ్‌రావు(32), జగద్గిరిగుట్టకు చెందిన నరేష్‌(31), బాలానగర్‌కు చెందిన ప్రసాద్‌(35)లు అక్కడకు వచ్చారు. 
 
ఈ ముగ్గురూ మహిళతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు. తాము కూడా ఆటోలో పురానాపూల్‌ వైపు వెళ్తున్నామని ఇంటి వద్ద దించేస్తామని నమ్మించారు. అత్తాపూర్‌ మీదుగా తిరిగి రాజేంద్రనగర్‌ వైపు ఆటోను మళ్లించడంతో ఆ మహిళ ఎక్కడకు తీసుకువెళ్తున్నారని అడగడంతో హోటల్‌లో బిర్యానీ తిని వెళదామని తెలిపారు.
 
హిమాయత్‌సాగర్‌ లార్డ్స్‌ కళాశాల వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ముగ్గురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి సెల్‌ఫోన్, మెడలోని రోల్డ్‌ గోల్డ్‌ చైన్, పర్సును తీసుకోని ఆటోలో పరారయ్యారు. అర్థరాత్రి సమయంలో స్థానికుల సహాయంతో బాధితురాలు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
 
కల్లు కంపౌండ్‌తో పాటు ప్రధాన రహదారులు, హోటల్, హిమాయత్‌సాగర్‌ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఆటో నెంబర్‌ను గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు.