శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (14:07 IST)

రాపాక విమర్శిస్తున్నారా? సర్లే భరిద్దాం అంటున్న పవన్?

జనసేన పార్టీలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. గత సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి పోటీ చేసి గెలుపొందారు ఈయన. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అల్లూరి క్రిష్ణంరాజు సహకారంతోనే ఈయన గెలిచారు. అయితే జనసేన పార్టీ ఓటమి తరువాత అల్లూరి క్రిష్ణంరాజు ఏకంగా పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరిపోయారు. అప్పటి నుంచి రాపాక వరప్రసాద్ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతారన్న ప్రచారం జోరుగానే సాగింది.
 
కానీ రాపాక మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తూ వచ్చారు. తాను చివరి వరకు జనసేన పార్టీలోనే ఉంటానంటూ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ చాలా సంతోషించారు. ఇదంతా జరుగుతుండగా రాపాక వరప్రసాద్ పైన మళ్ళీ స్థానిక నేతలు, ఆయన అనుచరులు ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. జనసేన పార్టీలో ఉంటే ఒరిగేది ఏమీ ఉండదని.. ఆ పార్టీని ఎంత త్వరగా వీడితే అంత మంచిదని చెప్పే ప్రయత్నం చేశారు. 
 
దీంతో రాపాక వరప్రసాద్ మైండ్ సెట్ మారింది. దీంతో రాపాక పార్టీని వదిలివెళ్ళి వైసిపిలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అది వైసిపి నిబంధన కూడా. అయితే టిడిపి నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ ప్రస్తుతం అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇదే విషయాన్ని తమ్మినేని సీతారం చెప్పారు. దీన్ని గుర్తించిన రాపాక పార్టీ నుంచి సస్పెండ్ అయితే తనకు అసెంబ్లీలో ఇలాంటి స్థానమే దక్కుతుందని.. అప్పుడు పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు రాపాక వరప్రసాద్.
 
దీంతో పార్టీ అధినేతపైనా తీవ్రస్థాయిలో విమర్సలు చేయడం ప్రారంభించారు. అది కూడా గత 15 రోజులు నుంచి తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తున్నారు. ఏకంగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం కూడా మానేశారు రాపాక వరప్రసాద్. గత కొన్నిరోజుల క్రితం జరిగిన రైతు సౌభాగ్యదీక్షకు రాపాక హాజరుకాలేదు. దీనిపై సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్. పార్టీలోని సీనియర్ నేతలందరితోను స్వయంగా ఆయన మాట్లాడారట. 
 
ఇదంతా తనకు అనుకూలంగా మారతుందని.. పార్టీ అధినేతను విమర్శిస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తారని, అప్పుడు రాజీనామా చేయకుండా వైసిపిలో చేరిపోవచ్చని రాపాక వరప్రసాద్ భావిస్తున్నారట. ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం రాపాకకు ఏమాత్రం ఇష్టం లేదట. దీంతో సమయం దొరికితే చాలు పవన్ కళ్యాణ్ పైన విమర్సలు చేసేస్తున్నారట రాపాక. 
 
జనసేనకు భవిష్యత్తు లేదని.. ఇలా వుంటే కష్టమని.. నెలకు ఒకసారి అధినేత జనాల్లోకి వస్తే ఎవరు నమ్ముతారని.. ఇలా సూటిపోటి మాటలతో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారట. అయితే ఇదంతా తెలిసి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారట. విమర్శిస్తే భరించే శక్తి వుండాలని హిత వచనాలు చెపుతున్నారట.