పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్ స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు మొదలయ్యాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్ ప్రారంభించింది. దీంతో గత రెండు రోజులుగా ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లక్ష్యంగా అమెరికా దాడి చేయగా అగ్రరాజ్య సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది. కువైట్, బహ్రెయిన్లోని స్థావరాలపై నౌక, వైమానిక దళాలు మిస్సైల్, డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించాయని ఐఆర్జీసీ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది.
రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని తొలుత ఇరాన్ ఉల్లంఘించిందని, కార్గో షిప్పై దాడులు చేసిందని అమెరికా ఆరోపించింది. దానికి ప్రతిస్పందనగానే ఇరాన్ స్థావరాలు, నిల్వ కేంద్రాలపై దాడులు చేశామని చెప్తోంది. అయితే కార్గో షిప్పై దాడిని అమెరికా ఒక సాకుగా చూపి, పశ్చిమాసియాలో పరిస్థితులను దిగజార్చుతోందని ఐఆర్జీసీ నిందిస్తోంది.
కాల్పుల విరమణను అమెరికానే ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఇదే కొనసాగితే.. పూర్తిస్థాయి ఒప్పందం కోసం జరుగుతోన్న దౌత్య ప్రయత్నాలు అన్నీ నిలిచిపోతాయని హెచ్చరించింది. ఎలాంటి దురాక్రమణకైనా తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని తన ప్రకటనలో పేర్కొంది.
