గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (12:09 IST)

జూమ్‌కు పోటీగా ఫేస్‌బుక్ వీడియో 'మెసెంజర్స్ రూమ్స్'

కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీనికితోడు లాక్‌డౌన్ కారణంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాయి. దీంతో ఐటీ కంపెనీలతో పాటు.. ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది తమ తమ ఇళ్ళ నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఐటీ కంపెనీలు తమ క్లయింట్లతో మాట్లాడేందుకు జూమ్ వీడియో కాలింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ చైనా యాప్‌ సెక్యూరిటీ పరంగా ఏమాత్రం సురక్షితం కాదనీ కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. 
 
దీంతో ఫేస్‌బుక్ రంగంలోకి దిగింది. జూమ్ యాప్‌కు పోటీగా వీడియో మెసెంజర్స్ రూమ్స్ యాప్‌ను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. జూమ్‌ యాప్‌కు ప్రత్యామ్నాయంగా అధునాతన ఫీచర్స్‌తో ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా, 'మెసెంజర్ రూమ్స్' పేరుతో తన మెసెంజర్ యాప్‌కు.. కొత్తగా వీడియో కాన్పరెన్స్‌ వెర్షన్‌ను జోడించింది. 
 
టైమ్‌ లిమిట్‌తో సంబంధంలేకుండా ఇందులో సంభాషణ కొనసాగించవచ్చు. తాము సమావేశం కావాలనుకున్న వారికి ఫేస్‌బుక్ అకౌంట్ లేకపోయినా కూడా వినియోగదారులు తమ 'మెసెంజర్‌ రూమ్స్'లోకి వారిని ఆహ్వానించవచ్చట. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో వీడియో కాలింగ్ కోసం అనేక యాప్‌లు ఉపయోగిస్తున్నారు. 
 
ముఖ్యంగా జూమ్‌ లాంటి యాప్‌లలో వర్చువల్ మీటింగ్స్‌తో పాటు అనుకూలమైన ఫోటో బ్యాగ్రౌండ్లకు కూడా వీలుండటంతో లక్షలాది మంది వినియోగదారులు దీనికి ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సింగ్‌ ఫీచర్‌ను డెవలప్ చేసిన ఫేస్‌బుక్‌.. త్వరలోనే మెసెంజర్ రూమ్స్‌కి వర్చువల్ బ్యాగ్రౌండ్లను జోడిస్తామని పేర్కొంది.