శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:05 IST)

బ్రావో ముఖేశ్... ఈ డీల్ యావత్ దేశానికి లాభం : ఆనంద్ మహీంద్రా

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి కారణం లేకపోలేదు. రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ రూ.43574 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అంటే.. రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్‌కు చెందిన షేర్లలో 9.99 శాతం వాటాను ఫేస్‌బుక్ యాజమాన్యం కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ అధినేత ముఖేశ్ స్వయంగా ప్రకటించారు. 
 
ఈ డీల్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఒప్పందాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించిన ఆనంద్... ఈ డీల్‌తో కేవలం ముఖేశ్ అంబానీ మాత్రమే కాదని, భారతీయులంతా లాభపడతారని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
'ఫేస్‌బుక్‌తో జియో డీల్ ఆ రెండు కంపెనీలకు మాత్రమే మేలును కలిగించదు. వైరస్ కష్టాల నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది. వైరస్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందోననడానికి ఈ డీల్ బలమైన సంకేతం. ప్రపంచ వృద్ధికి ఇండియా సరికొత్త కేంద్రం కానుందన్న ఊహ ప్రపంచానికి బలంగా అందించింది. చాలా చక్కటి డీల్‌ను కుదుర్చుకున్నారు. బ్రావో ముఖేశ్' అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.