అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి
రక్తదానం అనగానే తాను గుర్తుకు వస్తున్నానంటే అది నా పూర్వజన్మ సుకృతం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన బుధవారం హైదరాబాద్ నగరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఓ జర్నలిస్ట్ రాసిన వార్తను చదివిన తర్వాతే బ్లడ్ బ్యాంకు పెట్టాలనే ఆలోచన తనకు వచ్చిందని గుర్తుచేశారు. ఆ జర్నలిస్టుకు ఎప్పటికీ తాను రుణపడివుంటానని చెప్పారు. రక్తదాన శిబిరాలకు హాజరైనవారికి, రక్తదానం చేసేవారికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
అభిమానులను తన వ్యక్తిగత కీర్తికోసం వాడుకునేకంటే రక్తదానం వైపు నడిపించగలిగితే సమాజంలో వాళ్లకు గౌరవం పెరగడంతో పాటు ఎనలేని సంతృప్తి కలుగుతుంది కదా అని తాను ఆ రోజున పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇపుడు రక్తదానం అనగానే తన పేరు గుర్తుకు రావడం తన ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
అయితే, సామాజిక మాధ్యమాలపై తనను లక్ష్యంగా చేసుకుని అనేక మంది విమర్శలు చేస్తుంటారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను చేసిన మంచి పనులే మాట్లాడుతాయని చెప్పారు. తాను చేసిన మంచి పనులు, నా అభిమానుల ప్రేమానురాగాలే నాకు రక్షణ కవచాలు అని అన్నారు.
మనల్ని ఎవరైనా మాటలంటే మనం చేసిన మంచే సమాధానం చెబుతుంది. అందుకే తాను ఎపుడూ దేనికీ స్పందించను. తనలాగా మంచి చేసే తమ్ముళ్లకు అండగా ఉంటానని చెప్పారు. ఇతర దేశాల్లో కూడా ఉన్న తన అభిమానులు తన మాటను స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేస్తున్నారని, వాళ్లందరికీ అభినందనలు అని అన్నారు.