1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (19:32 IST)

వాట్సాప్ పేమెంట్ సేవలు.. ఆ నాలుగు బ్యాంకులతో డీల్ కుదిరింది..

వాట్సాప్ పేమెంట్ సేవలు భారత్‌లోనే తొలుత ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండేళ్ల నిరీక్షణ తర్వాత భారత్‌లో పేమెంట్‌ సర్వీసులను ప్రారంభించేందుకు గత నెలలోనే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) నుంచి అనుమతి పొందింది. తాజాగా దేశంలో టాప్‌-4 బ్యాంకులైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌లతో ఒప్పందం చేసుకున్నట్లు వాట్సాప్‌ పే బుధవారం ప్రకటించింది.
 
దేశంలో రెండు కోట్ల మందికి వాట్సాప్‌ పేమెంట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 160కి పైగా బ్యాంకుల్లో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్ఫేస్‌(యూపీఐ) లావాదేవీలు జరిపిందేందుకు వాట్సాప్‌ పేమెంట్స్‌ సపోర్ట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ నాలుగు బ్యాంకులతో వాట్సాప్‌ పే సర్వీసులు మొదలయ్యాయి. ఎస్‌బీఐకి 12 కోట్లకు పైగా యూపీఐ యూజర్లు ఉన్నారు. రోజురోజుకీ యూపీఐ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారతదేశంలో 2 కోట్ల మంది యూజర్లకు వాట్సప్ యూపీఐ సేవలు లభిస్తున్నాయి.
 
సెప్టెంబర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 1.8 బిలియన్. ఇలా ప్రతీ నెల యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. కొన్ని నెలలుగా క్రెడిట్ కార్డ్ లావాదేవీలు కూడా పెరిగాయి. ఇక వాట్సప్ పేమెంట్స్ విషయానికి వస్తే ఇప్పటికే ఇండియాలో యూపీఐ సేవలు అందిస్తున్న పేటీఎం, పోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే లాంటి వాటికి పోటీ ఇవ్వనుంది.