గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (16:36 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్‌.. ఎప్పుడొస్తుందో..?

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్‌లోని యూజర్లకు ఇటీవల వాట్సాప్ పే సేవలను అందుబాటులోకి తెచ్చింది. అయితే వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్‌ను ఎప్పటి నుంచో టెస్ట్ చేస్తున్నారు.  
 
డబ్ల్యూఏ బీటా ఇన్ఫో అనే వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ ప్రస్తుతం వాట్సాప్‌లో మల్టీ డివైస్ ఫీచర్‌ను చివరి దశలో టెస్ట్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే మల్టీ డివైస్ ఫీచర్‌ను గనక ఎనేబుల్ చేస్తే ఒకే వాట్సాప్ అకౌంట్‌ను భిన్న డివైస్‌లలో వాడుకోవచ్చు.
 
అలాంటప్పుడు మెసేజ్‌ల వరకు ఓకే. కానీ కాల్స్ వస్తే ఏ డివైస్ నుంచి కాల్స్ స్వీకరిస్తారు? అనే అంశంపైనే ఇప్పుడు ఫేస్‌బుక్ తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలిసింది. అయితే దీనికి ఒక విధానాన్ని పాటించేలా ఫీచర్‌ను అందిస్తారని తెలిసింది.
 
మల్టీ డివైస్ ఫీచర్‌ను వాట్సాప్‌లో ఒకేసారి 4 డివైస్‌లలో వాడుకునే విధంగా అందుబాటులోకి తెస్తారని సమాచారం. అయితే 4 డివైస్‌లలో ఒకే డివైస్‌ను మెయిన్ డివైస్ గా సెట్ చేసుకునే వీలు కల్పిస్తారు. దీంతో ఆ డివైస్ నుంచే కాల్స్ ను స్వీకరించాల్సి ఉంటుంది. 
 
ఇక మిగిలిన 3 డివైస్‌లలో మెసేజ్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇలా మల్టీ డివైస్ ఫీచర్ ద్వారా ఒక వాట్సాప్ ఖాతాను ఏకంగా 4 డివైస్‌లలో ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలోనే లింక్ ఎ న్యూ డివైస్ అనే ఆప్షన్ త్వరలోనే వాట్సాప్‌లో కనిపిస్తుందని తెలుస్తోంది.