నేపాల్ వరదలు.. సొరంగం నుంచి తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా...
ఆకస్మిక వరదలతో కుదేలైపోయిన నేపాల్ క్రమంగా కోలుకుంటుంది. అయితే, అనేక ప్రాంతాల్లో పలువురు బాధితులను రెస్క్యూ సిబ్బంది సజీవంగా ప్రాణాలతో వెలికి తీస్తోంది. తాజాగా ఓ సొరంగం నుంచి తొమ్మిది రోజుల తర్వాత ఓ వ్యక్తిని వెలికి తీశారు.
రసువా జిల్లాలోని త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద ఉన్న సొరంగం నుంచి భద్రతా బలగాలు ఇద్దరిని రక్షించాయి. దెబ్బతిన్న సొరంగం నుంచి మనుషుల మాటలు వినిపిస్తున్నట్లు ఆ దేశ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ సభ్యుడు శ్రీరామ్ న్యూపానే తొలుత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే అందులో చిక్కుకున్న వారు సజీవంగా ఉన్నట్లు నిర్ధరణకు వచ్చిన రెస్క్యూ సిబ్బంది.. సొరంగంలోని బురదను తొలగిస్తూ ఇద్దరిని సజీవంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, ఇప్పటికే నేపాల్ విద్యుత్తు ప్రాజెక్టులకు చెందిన పలు సొరంగాల్లో 900 మంది గల్లంతైనట్లు అధికారులు అంచనా వేసిన సంగతి తెలిసిందే.
ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులను మెకానికల్ ఫోర్మెన్ సంజయ్ సాహ్, మెకానికల్ సూపర్వైజర్ కబీర్ మహర్జన్గా గుర్తించారు. ఆగస్టు 26న సంభవించిన విపత్తు తర్వాత.. త్రిశూలి-3ఏ కేంద్రంలో 40మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
అడ్డుగా ఉన్న బురద, శిథిలాలను తొలగించడానికి భారీ యంత్రాలు, ప్రత్యేక పరికరాలను మోహరించారు. మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, ప్రతికూల వాతావరణం వంటి కారణాల వల్ల సహాయక చర్యల్లో జాప్యం నెలకొంటున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు లాంగ్టాంగ్ ఖోలా జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.
