1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (19:19 IST)

చంద్రుడిపై ఇంధనం తోడేస్తోరా? (video)

చంద్రుడిపైనే ఫ్యూయల్‌ ఫ్యాక్టరీకి జపాన్‌ శ్రీకారం చుట్టనుంది. చంద్రుడి ఉపరితల వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అక్కడ నీటి జాడల కోసం ముమ్మర అన్వేషణలు సాగుతున్నాయి. చంద్రుడిపై నీటి ఆనవాళ్లను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్‌-1 ఇప్పటికే గుర్తించింది.

చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు నీరు మంచు రూపంలో ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) భావిస్తోంది. ఈ ప్రదేశంలోని వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 చివరిమెట్టుపై విఫలమయ్యింది.

అయితే, ఈ మంచునే ఇంధనంగా మార్చాలని జపాన్‌ స్పేస్‌ ఎక్స్‌ప్లోరేటరీ ఏజెన్సీ (జాక్సా) నిర్ణయించింది.   నాసాతో కలిసి ఇప్పటికే చంద్రుడి కక్ష్యలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు జాక్సా ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ ఇంధన కర్మాగారాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది.

చంద్రుడిపై అన్వేషణ కోసం అంతరిక్ష యాత్రకు ఇంధనాన్ని భూమి నుంచి తీసుకెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల ఖర్చు తడిసిమోపుడు అవుతోందని అంటోంది. ఈ ఖర్చు తగ్గించుకోవడం కోసమే 2035 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఇంధనం తయారీ ప్లాంట్‌ నిర్మాణానికి సిద్ధపడుతోంది.

అక్కడ మంచు రూపంలో ఉన్న ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ వాయువులను సోలార్‌ సెల్‌ ద్వారా వేరు చేసి, వాటిని మళ్లీ కలపి ఇంధనాన్ని తయారుచేయనుంది. దీంతో చంద్రుడి కక్ష్యలో ఏర్పాటు చేసే అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుడిపైకి వెళ్లే వ్యోమనౌకలకు ఉపయోగించే ఇంధనం అక్కడే లభిస్తుందని జాక్సా వెల్లడించింది. మరి ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

ప్రాథమిక అంచనాల ప్రకారం.. చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించగలరు. మానవ వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై దిగడానికి 37 టన్నుల నీరు వసరమవుతుంది.

2024 నాటికి చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమగాములను పంపాలని నిర్ణయించిన అమెరికా, జపాన్‌.. ఈ ఏడాది జులైలో దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి.