శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (21:22 IST)

ఆషాఢమాసం గోరింటాకు.. అసలు కథేంటి.. సౌభాగ్యానికి చిహ్నమా? (video)

Henna
ఆషాఢమాసం గోరింటాకుకు ప్రత్యేక స్థానం వుంది. ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకోవాల్సిందేనని మహిళలకు పెద్దలు చెప్తుంటారు. 
 
ఎందుకంటే.. గోరింటాకు పెట్టుకోవటంలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి భారతీయులు ఆచరించే ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనం దాగి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో సూక్ష్మజీవులు, అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మహిళలు ఎక్కువగా నీటితో పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ల చేతులు, కాళ్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. 
 
దీనివల్ల వాళ్లు తొందరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేదం చెబుతోంది. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉండొచ్చు.
 
ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట ఆకులే కాదు… పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు… అన్నీ ఔషధయుక్తాలే. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే.
 
ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఇటీవలి కాలంలో ఫ్యాన్సీ షాపుల్లో దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. 
 
కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలి.
 
అలాగే ఆధ్యాత్మిక పరంగా.. గోరింటాకు గౌరీదేవి ప్రతీక. గౌరి ఇంటి ఆకు.. గోరింటాకుగా మారిందని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు పుట్టుక వెనుక ఒక కథ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే.. గౌరీ దేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది. 
 
ఆ సమయంలో గౌరీ దేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్కగా ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పరిగెత్తుకుంటూ వెళ్లి పర్వతరాజుకు ఈ విషయం చెబుతారు. సతీసమేతంగా పర్వతరాజు.. వనానికి వచ్చేసరికి ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టు అవుతుంది.
 
అప్పుడు ఆ చెట్టు సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను. నా వల్ల ఈ లోకంలో ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అప్పుడు గౌరీ దేవి చిన్న పిల్లల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆ ఆకు తగలగానే గౌరీదేవి వేళ్లు ఎర్రబడిపోతాయి. 
 
అది చూసిన పర్వతరాజు దంపతులు.. అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అని విచారం వ్యక్తం చేసేలోపే.. గౌరీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని చెబుతుంది. 
 
పైగా ఈ రంగు చాలా అలంకారంగా అనిపిస్తుందని అంటుంది. అప్పుడు పర్వతరాజు ఉండి.. ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నాంగా ఈ గోరింటాకు భూలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలిపాడు. స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని తెలిపాడు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింటాకుపై మక్కువ పుట్టిందని చెబుతుంటారు.