1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Karthika Suddha Ekadashi And Its Importance

కార్తీకశుద్ధ ఏకాదశి.. యోగనిద్ర నుంచి విష్ణువు మేల్కొనే రోజు.. ఇలా చేస్తే?

Karthika Suddha Ekadashi
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొనే రోజు (నవంబర్ 25, 2020). తొలి ఏకాదశిగా పేరుగాంచిన ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లే మహావిష్ణువు.. కార్తీక శుద్ధ ఏకాదని రోజునే మేల్కొంటారు. ఈ ఏకాదశినే ఉత్థాన ఏకాదశి అంటారు. దీనినే హరిబోధిని ఏకాదశి, దేవప్రబోధిని అని కూడా పిలుస్తారు. చాతుర్మాస వ్రతం ప్రారంభించిన తొలి ఏకాదశి, కార్తీకశుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. భీష్మపితామహుడు మహాభారత యుద్ధంలో ఈ ఏకాదశి రోజునే అస్త్రసన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. 
 
యజ్ఞవల్క్య మహర్షి ఈ రోజునే జన్మించాడు. కార్తీకశుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు. యోగులు, సిద్ధులు మొదలైన వారు విష్ణులోకం చేరుకొని కీర్తనలతో, భజనలతో, కర్పూరహారతులతో శ్రీమహావిష్ణువును మేల్కొలుపుతారు. విష్ణువుకి హారతి ఇవ్వడం వల్ల అకాలమృత్యు దోషం తొలిగిపోతుంది. విష్ణుమూర్తికి హారతి ఇవ్వడం కుదరని పక్షంలో దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఇచ్చే హారతిని చూడండి, స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. 
 
బ్రహ్మదేవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన ఏకాదశి మహత్యాన్ని గురించిన విశేషాలు స్కాందపురాణంలో వివరించబడింది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువుని పూజించి, రాత్రి జాగరణ చేసి, ద్వాదశి ఘడియలు ఉండగానే శ్రీమహావిష్ణుపూజ చేసి, భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. వస్త్రం, పళ్ళు, దక్షిణ తాంబూలాన్ని పండితులను దానం చేయడం వల్ల ఈ లోకంలోనే కాకుండా మరణం తరువాత కూడా స్వర్గసుఖాలు పొందుతారు. ఏకాదశి వ్రతం చేసినవారు ఒకరికి అన్నదానం చేయడం వలన సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. 
 
ఏకదాశి రోజున ఉపవసించే వారికి సర్వపాపాలు తొలగిపోతాయి. వెయ్యి అశ్వమేథ యాగాలు, వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జీవుడు వేలజన్మాలలో చేసిన పాపాలను కాల్చేస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేసి, ఒక చిన్న మంచిపని చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు సర్వపాపపరిహారం కలుగుతుంది, పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞాలు, యాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది’ అని బ్రహ్మదేవుడు నారదమహర్షికి తెలిపాడు.
About Writer
సెల్వి