దళితులు రోడ్డుపై నడిచారని పసుపు నీళ్లతో శుద్ధిచేశారు : భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు రోడ్డుపై నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేశారన్నారు. అలాగే, దళితుడైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను భారత రాష్ట్ర సమితి నేతలు అన్ని విధాలుగా అవమానించారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, మంగళవారం జహరిగిన సభా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత భారాసకు చెందిన ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీచేశారు. అయితే, సస్పెన్షన్ తీర్మానంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో మాట్లాడారు.
'అవమానాలు కొనసాగించే పరిస్థితి మానుకోవాలని కోరుతున్నా. సభాపతి సూచన చేస్తే వాదన పెట్టుకోకుండా సభ సజావుగా నడిచేలా చూడాలి. వెల్లోకి వచ్చి చేయాల్సిన అవమానాలన్నీ చేసి.. స్పీకర్పై సవాల్ విసురుతున్నారు. ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేయొద్దు. విభజన తీసుకురావడానికి మరో ప్రయత్నం మంచిది కాదు. సభాపతితో పాటు వారి తల్లిని దూషిస్తే నిరసనలు తెలిపారు. నిరసనలో భాగంగా దళితులు రోడ్డుపై నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.
పసుపు నీటితో శుద్ధి చేసి అవమానించడమే కాకుండా న్యాయం కావాలంటున్నారు. న్యాయం కావాల్సింది.. బలహీనవర్గాలు, దళిత, గిరిజనులకు. మీ చేతుల్లో అవమానానికి గురవుతున్న ప్రజలకు న్యాయం కావాలి. విపక్ష నేతల ఆగడాలు, అవమానాలను ప్రభుత్వం సంయమనంతో భరిస్తోంది. రాష్ట్రాన్ని విపక్ష నేతలు ఏం చేయాలనుకుంటున్నారు. దొరతనం పోకడలను భరించడానికి రాష్ట్రం సిద్ధంగా లేదు' అని భట్టి విక్రమార్క అన్నారు.
