తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్త్రఫ్
dతెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయ్యారు. తన మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర గవర్నర్ను కోరారు. దీంతో తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేశారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కొండా సురేఖ స్పందిస్తూ, 'నన్ను బర్తరఫ్ చేయడాన్ని ఖండిస్తున్నా. ఈ నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సింది. నా కుమార్తె స్వతంత్ర మహిళ. ఆమె వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు? నా కుమార్తె వ్యాఖ్యలను నేను ఖండించాల్సిన అవసరం లేదు. ఆమె వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుబట్టే అధికారం నాకు లేదు. కాంగ్రెస్ అధిష్ఠానానికి నేను ఇచ్చిన లేఖను మీడియాకు విడుదల చేస్తున్నా. జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏం నిర్ణయం తీసుకున్నారు?' అని కొండా సురేఖ ప్రశ్నించారు.
కాగా, గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలను మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఖండిచలేదు. పైగా, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఒక నివేదికను పార్టీ అధిష్టానానికి ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా కొండా సురేఖను మంత్రిపదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. అయితే, ఆమె పట్టించుకోకపోవడంతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ సీఎం రేవంత్ గవర్నర్ను కోరారు.
