తెలంగాణాలో తొలిసారి సరస్వతీ నది పుష్కరాలు.. ప్రారంభించిన కంచి పీఠాధిపతి
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి సరస్వతీ నది పుష్కరాలు తొలిసారి అత్యంత వైభవోపేతంగా ఆరంభమయ్యాయి. గురువారు ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తొలిసారి అంత్య పుష్కరాలు నిర్వహిస్తోంది.
అదేసమయంలో వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అసౌకర్యం కలగకుండా భారీ టెంట్లు, కూలర్లు సైతం ఏర్పాటుచేశారు. సరస్వతీ ఘాట్తోపాటు ప్రధాన ఘాట్ వద్ద స్నానాలు ఆచరించేవారు దుస్తులు మార్చుకొనేందుకు తాత్కాలిక గదులను 300కు పైగా ఏర్పాటు చేశారు.
నదిలో లోతులోకి వెళ్లకుండా భద్రతా చర్యల్లో భాగంగా తాళ్లతో హద్దులు ఏర్పాటు చేశారు. జూన్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం హారతి ఉంటుంది. అంత్య పుష్కరాలకు భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని అధికారులు చెబుతున్నారు.
ప్రాణహిత, గోదావరి నదుల్లో అంతర్వాహిణిగా సరస్వతి నది ప్రవహిస్తున్న ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ధి చెందింది. దేశంలో సరస్వతి నది ఉన్నది ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, రెండోది కాళేశ్వరంలోనే. అక్కడ కుంభమేళా నిర్వహించటం ఆనవాయితీ. కాగా, తెలంగాణలో తొలిసారి అంత్య పుష్కరాలకు సైతం ప్రాధాన్యమిచ్చి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయటం విశేషం. ఆది పుష్కరాల్లో నది స్నానం ఆచరించటం.. పితృతర్పణాలు ఇవ్వడం ఎలా ఫలితాలొస్తాయో.. అంత్య పుష్కర సమయంలోనూ ఆయా కార్యక్రమాలతో అవే ఫలితాలుంటాయని వేదపండితులు చెబుతున్నారు.
