1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (21:31 IST)

జ‌గమంత కుటుంబంలో ఏకాకిని నేనంటూ నిష్క్రమించిన సీతారామ‌శాస్త్రి

Sitaramashastri,
ప్రముఖ టాలీవుడ్ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మ‌ర‌ణం తెలుగు సినిమారంగానికి దిగ్ర‌భాంతికి గురిచేసింది. చిరంజీవి, ప్ర‌భాస్ వంటివారు కూడా ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. చ‌క్రం సినిమాలో జ‌గ‌మంత కుటుంబం.. అనే గీతం ఆయ‌న ర‌చ‌న నుంచి వ‌చ్చినప్పుడు దాన్ని ఆయ‌న పాడుతూ నాకు వినిపించిన విధానం ఏదో లోకానికి తీసుకెళ్ళిన ఫీలింగ్ క‌లిగింద‌ని- ప్ర‌భాస్ ఆ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా పేర్కొన‌డం విశేషం. ‘జగమంత కుటుంబం నాది’ పాట ఎక్స్‌ప్రెషన్‌ నాది అయినా మా నాన్నగారి జీవనసంవిధానం అది అంటూ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ కూడా అప్ప‌ట్లో తెలిపారు.
 
‘సిరి వెన్నెల’చిత్రంలో ‘విధాత తలపున’ పాటతో మొదలైన సీతారామశాస్త్రి గేయ ప‌య‌నం అదే విధాత ద‌గ్గ‌ర‌కు వెళ్ళిపోయార‌ని ఆప్తుడు త‌నికెళ్ళ‌భ‌ర‌ణి బాధ‌తో నివాళుల‌ర్పించారు.

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత‌లు చంద్ర‌బోస్ తో స‌హా అంద‌రూ తాము ఈ వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని పేర్కొంటున్నారు. 
 
ద‌ర్శ‌కుడు మారుతీ నివాళుల‌ర్పిస్తూ,   మీ పాటలే  మేము నేర్చుకొన్న  పాఠాలు  మీ సూక్తులు మేము రాసుకొనే మాటలు. బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడు అని  సాయం గా  ఇంత తొందరగా వెళ్లిపోయారా ?
నా పాట పూర్తి చేసి వెళ్లిపోయారు కానీ పాఠం మధ్యలోనే వదిలేసారు  గురూజీ అంటూ పేర్కొన్నారు.
 
హీరో సాయితేజ్ బాధ‌ను వ్య‌క్తం చేస్తూ, భరించలేని నిజం చెవులు వింటున్నాయి. కానీ మనసు ఒప్పుకోవటం లేదని నివాళుల‌ర్పించారు.
 
నిశాచ‌రుడు అనేవారు
- కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `చ‌క్రం` సినిమా గీత ర‌చ‌యిత‌గా ఆయ‌న‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. జ‌గమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది.. అంటూ.. లోతైన భావాల్ని జీవిత‌సాగ‌రంలో ఆయ‌న క‌లంతో రుచి చూపించారు. ఆయ‌న పాట‌లు రాయ‌డ‌మేకాదు. పాట‌లు పాడుతూ దాన్ని ఆస్వాదించేవారు. నిశాచ‌రుడు అని ఇంట్లోవారు అంటుంటార‌ని ఆయ‌న ఓ సంద‌ర్భంలో చెప్పేవారు. రాత్రంతా మెల‌కువ‌గా వుంటూ అప్పుడు వ‌చ్చిన ఐడియాల‌ను క‌లం రూపంలో రాస్తూనే వుండేవారు. అలాంటిదే జ‌గ‌మంతా కుటుంబం.. అని వెల్ల‌డించారు. 
 
సినీ గీతం ప‌క్క‌దారి ప‌ట్టింద‌ని ఆయ‌న ప‌లుమార్లు వాపోయారు. శ్రీ‌శ్రీ‌ని స్పూర్తిగా తీసుకుని ప‌లు ప‌దాల‌ను, సాహిత్యాన్ని రాసిన సంద‌ర్భాలున్నాయి. సినీ సాహిత్యం ఒక‌రిద్ద‌రు మిన‌హా గాడిత‌ప్పేలా వున్నాయ‌న్న భావ‌న‌తో - భయపడుతూ బతకడం కంటే.. చచ్చి బతికిపోదామనే పరిస్థితి. అందుకే ఇప్పుడు రాస్తే.. ‘‘శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు.. బతికి ఉండగల సాహసానివై పరుగులు తీ’’ అని రాస్తా. అంటూ ఓ ఇంట‌ర్వూలో త‌న క‌విత గురించి వివ‌రించారు.
 
తండ్రి వార‌త‌స్వం
తండ్రి పండితుడైనా కొడుకు అవ్వాల‌నే లేదు. కానీ నాకు నాన్న గారే ఆద‌ర్శ‌నం. ఆయ‌న్నుంచి నాకు కొంచెం జ్ఞానం అబ్బింద‌ని అనేవారు. దాదాపు 15 భాషల్లో అపార పాండిత్యం కలిగిన వ్యక్తి. నాన్న‌గారు. పెద్దకొడుకైనన నాకు అవన్నీ నేర్పించాలన్న ఉద్దేశంతో అన్నీ చెప్పేవారు. మా నాన్నగారు నాకిచ్చిన మహా ఆస్తి నన్ను నేను నిరంతరం ప్రశ్నించుకోవడం. సినిమాల్లోకి వచ్చాక పాండిత్యం కంటే కూడా అదే ఉపయోగపడింది.
 
డాక్ట‌ర్ కాబోయి రైట‌ర్‌
చిన్న‌త‌నంలో మ‌నం ఏదో అవ్వాల‌నుకుంటాం. కానీ మ‌న‌కు ఆ జ్ఞానం పూర్తిగా తెలీదు. నేను పి.జి. చేసినా జాబ్ వ‌స్తుంద‌న్న భ‌రోసా లేదు.  ఎంబీబీఎస్‌ చేయమన్నారు. ఎంబీబీఎస్‌లో చేరాను. కానీ ఆ క్రమశిక్షణ నాకు అలవాటు లేదు. అదే సమయంలో నేను పదోతరగతి సర్టిఫికెట్‌ మీద దరఖాస్తు చేసిన టెలికం ఉద్యోగం వచ్చింది. సినిమా చాన్స్‌ వచ్చినప్పుడు నేను వెనకడుగు వేసినా మా సత్యారావు మాస్టారు బలవంతంగా దీంట్లోకి తోశారు. మా త‌మ్ముడే న‌న్ను బాగా ప్రోత్స‌హించార‌ని తెలిపారు. అలా ఆయ‌న‌ రాసిన పాటలు విశ్వనాథ్‌గారి చెవిలో పడటంతో ‘సిరివెన్నెల’ చాన్స్‌ వచ్చింది. ఇక అక్క‌డ‌నుంచి ఇంటిపేరు సిరివెన్నెల‌గా మారిపోయి తెలుగు సినీ సాహిత్యంలో కొత్త ప్ర‌క్రియ‌కు సీతారామ‌శాస్త్రి శ్రీ‌కారం చుట్టారు.