శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (19:08 IST)

కుదుటపడిన ఆరోగ్యం... బెడ్‌పై లేచి కూర్చొంటున్న బాలు...

కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గానగంధర్వుడు ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. దీంతో ఆయన బెడ్‌పై లేచి కూర్చొంటున్నట్టు ఆస్పత్రి వర్గాల సమాచారం. అదేసమయంలో త్వరలోనే ఆయనకు నోటి ద్వారా ఆహారాన్ని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, కరోనా వైరస్ బారినపడి బాలు... గత ఆగస్టు నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు. ఆరంభంలో ఆరోగ్యంగా ఉన్న బాలు... ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 
 
ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వివరాలు తెలిపారు. సెప్టెంబరు 10వ తేదీన చివరిసారిగా హెల్త్ అప్ డేట్ ఇచ్చానని, మళ్లీ ఇప్పుడు మీ ముందుకు వచ్చాను అంటూ చరణ్ ఓ వీడియో సందేశం వెలువరించారు. ఈ నాలుగు రోజుల వ్యవధిలో తన తండ్రి ఆరోగ్యం ఎంతో మెరుగైందని తెలిపారు.
 
ఊపిరితిత్తుల పనితీరు కూడా గతంతో పోల్చితే ఎంతో సవ్యంగా ఉందని, ఫిజియోథెరపీకి తన తండ్రి చురుగ్గా స్పందిస్తున్నారని వెల్లడించారు. డాక్టర్ల ప్రయత్నం కారణంగా ఆయన 15 నుంచి 20 నిమిషాల సేపు కూర్చోగలుగుతున్నారని చరణ్ వివరించారు. 
 
ఇకపై నోటి ద్వారా ఆహారం అందించబోతున్నారని, ఇప్పటివరకు అన్నీ సానుకూలాంశాలే ఉన్నాయని, ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తన తండ్రి కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నారు.