గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 16 మే 2019 (16:42 IST)

సక్సెస్ రేట్ డౌన్.. ఇక లాభం లేదు.. యాక్టర్‌గా వీవీవీ..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ ఎవరంటే మన నోట్లో నుండి మొదటిగా వచ్చే మాట దిల్ రాజు. దిల్ చిత్రంతో నిర్మాత రాజును వినాయక్ దిల్ రాజుగా మార్చేసిన విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఇప్పుడు దర్శకుడిగా కొద్దిగా తడబడుతున్నాడు. ఖైదీ నెం.150 చిత్రం సక్సెస్ అందించినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ఇంటిలిజెంట్ చిత్రం నిరాశ మిగిల్చింది. 
 
సక్సెస్ రేట్ తగ్గడంతో వినాయక్‌తో సినిమాలకు హీరోలు ఆలోచిస్తున్నారు. కొంత మంది పేర్లు ప్రస్థావనకు వచ్చినా వినాయక్ మూవీ ఏదీ ఫైనల్ కావడంలేదు. వినాయక్ దర్శకత్వంలో సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో, మరో ఆసక్తికరమైన వార్త సిని వర్గాల మధ్య చక్కర్లు కొడుతోంది. శరభ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన ఎన్ నరసింహారావు దర్శకత్వంలో వినాయక్ ప్రధాన పాత్రలో నటించబోతున్నాడట. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నాడనే వార్త కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 
 
తనను నిర్మాతగా నిలబెట్టిన వినాయక్‌ను నటుడిగా నిలబెట్టేందుకు దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. దర్శకులు నటులుగా మారడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. కానీ వినాయక్ ఇన్నేళ్లు దర్శకుడిగా ఉండి హఠాత్తుగా నటుడిగా మారడం చర్చనీయాంశం అయింది. 
 
వినాయక్ రవితేజతో సినిమా తీయడానికి సిద్ధమైనట్లు ఒక ప్రక్క వార్తలొస్తుండగా, ఇప్పుడు ఈ తాజా వార్తతో గందరగోళం మొదలైంది. ఇదివరకు చిరంజీవీ ఠాగూర్ సినిమాలో చిన్న పాత్రలో నటించి వినాయక్ మెప్పులు పొందారు. వినాయక్ ఇప్పుడు కూడా మెప్పిస్తాడనే ఎక్స్పెక్టేషన్‌తో అందరూ ఉన్నారు.