1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (07:28 IST)

భారత్ అంతా ఒక్కటే.. ఉత్తరాది - దక్షిణాది అనే తేడా ఉండదు : ఏఆర్ రెహ్మాన్

ar rahman
భారత్ అంటే ఒక్కటే దేశమని, ఇక్కడ ఉత్తరాది, దక్షిణాది అనే తేడా ఉండదని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్పష్టం చేశారు. తద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు గట్టిగానే కౌంటరిచ్చారు. ఇంగ్లీష్‌కు ప్రత్యామ్నాయం హిందే అంటూ అమిత్ షా ఇటీవల వివాదాస్ద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. వీటికి దక్షిణాదిలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో జరిగిన ఓ సదస్సులో ఆయన ఐకాన్ అవార్డును స్వీకరించారు. భారత్ అంతా ఒకటేనని, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని వేర్వేరుగా చూడరాదని విజ్ఞప్తి చేశారు.
 
'గతంలో ఓసారి నేను మలేషియా వెళ్లాను. అక్కడ ఓ చైనా జాతీయుడు ఉత్తర భారతదేశం అంటే తనకెంతో ఇష్టమని, వారి సినిమాలు ఎక్కువగా చూస్తానని చెప్పాడు. దాంతో ఆ చైనా జాతీయుడు అసలెప్పుడైనా దక్షిణాది సినిమాలు చూశారా..? అనే సందేహం కలిగింది. ఉత్తరాది మాత్రమే భారతదేశం అనే భావన పోవాలి.
ar rahmen - khushbu
 
భారత్‌లో ఉత్తరాది చిత్రాలే కాదు, తమిళ చిత్రాలు ఉన్నాయి, అలాగే మలయాళం, ఇతర భాషల చిత్రాలు కూడా ఉన్నాయి. ఉత్తరాదిన మనవాళ్లు రాణిస్తున్నారు... దక్షిణాదిన ఉత్తరాది వాళ్లు రాణిస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే అడ్డుగోడలు లేవు. 
 
కళ, చిత్రాల ద్వారా ప్రజలను విడగొట్టడం ఎంతో సులువైపోయింది. కానీ ఇప్పుడు అందరూ ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది. అప్పుడు ఓ దేశంతో ఎంతో శక్తిమంతం అవుతాం... తద్వారా ప్రపంచాన్ని శాసించగలం" అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, అమిత్ షా హిందీ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని, 'తమిళం ఈ దేశానికి అనుబంధ భాష' అంటూ స్పష్టం చేశారు.