1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (10:14 IST)

హోం మంత్రి అమిత్ షా‌తో గవర్నర్ తమిళిసై భేటీ.. కీలక నివేదిక సమర్పణ

tamizhisai - amit shash
కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు తనకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య ఉన్న గ్యాప్‌పై హోం మంత్రికి ఆమె ఓ కీలక నివేదికను సమర్పించారు. ఇందులో అన్నివిషయాలను కూలకుషంగా వివరించినట్టు సమాచారం.
 
కాగా, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసైల మధ్య గత కొద్ది రోజులుగా మరింత దూరం పెరిగిన విషయం తెల్సిందే. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి కూడా గవర్నర్‌ను పిలవకుండానే ప్రభుత్వ నిర్ణయించింది. అలాగే, రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి వెళ్లలేదు. గవర్న‌ర్‌ను సీఎం దూరంగా పెట్టినపుడు తాము వెళితే లేనిపోని సమస్యలు వస్తాయని భావించిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు రాజ్‌భవన్‌కు దూరంగా ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో గవర్నర్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా హోం మంత్రి అమిత్ షా కబురు పంపారు. దీంతో ఆమె సోమవారమే ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా, అనివార్య కారణాల రీత్యా ఆ పర్యటన మంగళవారానికి వాయిదా వేసుకుని హస్తినకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో కీలక అంశాలపై ఆమె నివేదిక సమర్పించారు. మరోవైరు, వచ్చే యేడాది తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలపై అమిత్ షా ప్రత్యేకంగా దృష్టించిన విషయం తెల్సిందే.