మీ పిల్లల పట్ల మీరు చూపే ప్రేమాభిమానములు విలువైనవి, అమూల్యమైనవి, వెలకట్టలేనివి ... కాకపోతే ఈ ప్రేమలో పడి ప్రతీ తల్లి, తండ్రులు చేస్తున్న చాలా చిన్న విషయం అనుకునే పెద్ద పొరపాటు... “నేను పడే కష్టం, శ్రమ నా బిడ్డ పడకూడదు” ఇది తల్లి, తండ్రుల నిష్పక్షపాతమైన, కల్మషం లేని, పవిత్ర ప్రేమకు చిహ్నo. కాని ఇక్కడ మీరో విషయం మర్చిపోతున్నారు...
మీరు ఆ కష్టాలు, శ్రమలు పడ్డారు కాబట్టే ఇంత పైకి వచ్చి భాద్యతగా ఉంటూ వున్నారు. అదే మీ పిల్లల విషయంలో మీరు కఠినంగా ఉండకుండా సున్నితంగా వారికి లోకం తెలియకుండా పెంచితే మాత్రం మీరు, వారు, వారితో వున్న ప్రతీ ఒక్కరు మూల్యం చెల్లించాల్సి వుంటుంది. కష్టమేమిటో ఎరగని వాడికి సుఖం విలువ తెలియదు. నష్టమేమిటో ఎరుగని వాడికి లాభం విలువ తెలియదు.
కాలమేమిటో తెలియని వాడికి జీవితం విలువ తెలియదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి... "అతి ప్రేమ, అతి గారాబం, అతి అలుసు అనేది అస్సలు మంచిది కాదు". మీ పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచాలనే భావనతో వారిని మరీ సున్నితంగా పెంచుతున్నారు. ఇదే నేడు సమస్యగా మారింది.
మౌనిక అనే అమ్మాయి ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. అడిగింది కాదనకుండా ఇంకా ఎక్కువగా ఆమెకు తెచ్చి అందిస్తారు. చిన్నతనం నుండి ఓ మహారాణి అన్న భావనను మౌనికలో పెంచారు. ఉన్నత చదువులు చదివి. పెళ్లాయ్యాక భర్త ఆమెను ప్రత్యేకంగా చూడకపోవడంతో గొడవ పడేది. ఇలా పెరిగడం వల్లే చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా మౌనిక ఒక్కటే కాదు.. ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్నచిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
పెంపకంలోని లోపాలే ఇలాంటి వాటికి కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు జీవితం విలువ, డబ్బు విలువ తెలియచేయాలి... కొన్ని సందర్భాలలో చేతి నిండా డబ్బు ఉన్నా తినడానికి తిండి దొరకదు.. అలాగే కొన్నిసార్లు తినిడానికి అన్నీ దొరికినా చేతిలో డబ్బులు ఉండవు.. ఇటువంటి పరిస్థితులు జీవితంలో ఎదుర్కొన్న వారికి తప్పకుండా అన్నం, డబ్బు విలువ తెలుస్తుంది. అతి గారాబం చేయడం వలన పిల్లలకు కష్టాలు తట్టుకొనే శక్తి సడలుతుంది.. అలాగే అతి భయం, బెదిరింపు, కొట్టడం, తిట్టడం చేయడం వలన మొండిగా/మూర్ఖంగా తయారయ్యే అవకాశం ఉంది.
కనుక తల్లిదండ్రులు ఈ రెండింటిని బేలన్స్ చేస్తూ పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొనే శక్తి కలిగే వారిగా చేసి వారికి మార్గదర్శకంగా నిలవాలి. వారికి కష్టం... నష్టం... సుఖం అన్నీ తెలియాలి. లగ్జరీగా పిల్లల్ని పెంచడం నేటి ఫ్యాషన్. అదే ఇప్పుడు కొంప ముంచుతోంది. ఇలా పెరిగినవారు చిన్న కష్టాలకే హడలుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ అంశాలపై అవగాహన పెంచాలి. కొంతమంది తల్లి, తండ్రులు తమకు ఎన్ని కస్టాలు వున్నాయో, సరుకులు తెచ్చేందుకు కూడా ఎలా ఇబ్బంది పడుతున్నారో వగైరా విషయాలు పిల్లల దాకా రానివ్వరు. ఇవన్ని వాళ్ళకు తెలియాలని అనుకోరు.
కాని అది కరెక్ట్ కాదు. పిల్లలకు విచ్చలవిడితనాన్ని మనమే అలవాటు చేస్తున్నాం. మీరు సంపాదించే ప్రతీ రూపాయి యెంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారో వాళ్ళకు తెలియాలి. తద్వారా వాళ్ళకు దుబారా ఖర్చులు అలవడకుండా వుంటాయి. ముఖ్యంగా తల్లితండ్రులు వాళ్లకు చదువు కంటె జీవితంలో చోటుచేసుకునే విషయాలు ఎక్కువ అవగాహనకు తీసుకురావాలి. చదువు ఒక్కటే ఉంటే ఈ కాలంలో సరిపోదు.
ఇలా ప్రతీ తల్లి, తండ్రులు వాళ్ళ పిల్లలకు సరైన అవగాహనా, సరైన శిక్షణ అందిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు తప్పకుండా అవుతారు. గొప్పవాళ్ళు కాకపోయినా మంచి మనుషులుగా మిగులుతారు. ప్రతీ గొప్పవారు డబ్బు నుంచి వచ్చిన వారు కాదు కష్ట, నస్టాల్లో నుంచి వచ్చిన వారు. కారణం వారు అన్నీ అనుభవించి వచ్చినవారు కనుక వారికి అన్నీ తెలుసు.. పిల్లల్ని ముద్దుగా చూడటంలో తప్పులేదు కానీ... వారికి లోకం తెలీకుండా పెంచడంలోనే అసలు సమస్య. అందుకే తల్లి, తండ్రులు పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలి.