ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వివేదీకి ఏపీ సర్కారు ఝులక్!!

dwivedi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పద ఐఏఎస్ అధికారులు ముద్రపడినవారిపై కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పటికే అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తప్పించింది. వారిలో అనేక మందికి ఎలాంటి పోస్టింగులు ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత వైకాపా ప్రభుత్వం వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదీపై బదిలీవేటు వేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ఆదేశించింది. 
 
గత వైకాపా ప్రభుత్వంలో గ్రామ, సచివాలయాలకు పార్టీ రంగుల అంశంలో ఈయనపై అనేక విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. విపక్ష నేతలను సైతం ధిక్కరించారు. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ద్వివేదీని వ్యవసాయ, గనుల శాఖ నుంచి తప్పించి కార్మిక శాఖకు బదిలీ చేసింది. ద్వివేదీ వ్యవహారశైలి గతంలో వివాదాస్పదమైన నేపథ్యయంలో ఈ నియామకం ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
గతంలో గ్రామ, వార్డు సచివాలయాలకు పార్టీ రంగుల అంశంలో ఈయన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని రోజుల వ్యవధిలోనే ద్వివేదీకి రెండోసారి స్థానచలనం కల్పించింది. అదేసమయంలో కార్మిక శాఖ అదనపు బాధ్యతలను పశుసంవర్ధక శాఖ కార్యదర్శి నాయక్‌కు ఏపీ సర్కారు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.