నా బిడ్డలను బాగా చూసుకో తమ్ముడూ... సెల్ఫీలో కన్నీటి వినతి.. ఆపై వివాహిత ఆత్మహత్య
'తమ్ముడూ! నేను వెళ్లిపోతున్నా. నా బిడ్డల బాధ్యత నీదే.. బాగా చూసుకో' అంటూ ప్రాధేయపడుతూ కన్నీళ్లు పెట్టుకొంది. దాన్నంతా సెల్ఫీలో రికార్డు చేసి తమ్ముడికి పంపించింది. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకొంది. అదనపు కట్నం కోసం అత్తింటివాళ్లు పెట్టిన ఆగడాలకు ఓ వివాహిత బలైంది. ఈ ఉదంతం విజయవాడలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
హైదరాబాద్కు చెందిన హసనబీ (25) అనే యువతికి ఆరేళ్ల క్రితం విజయవాడ భవానీపురానికి చెందిన జానపహాడ్తో వివాహమైంది. హసన్బీ ప్రైవేట్ స్కూలులో టీచర్గా పనిచేస్తుండగా, జాన్ పహాడ్ మెకానిక్. వారికి నాలుగు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహ సమయంలో 40 తులాల బంగారం, ధన రూపేణా కానుకలను హసన్బీ కుటుంబం ఇచ్చింది. అవి చాలవని, పుట్టింటికి వెళ్లి మరికొంత డబ్బు తీసుకురావాలని అత్తింటివాళ్లు హసన్బీపై ఒత్తిడి తెచ్చారు.
ఈ వేధింపులను తట్టుకోలేని పరిస్థితుల్లో గురువారం అర్థరాత్రి ఇంట్లో ఉరి వేసుకొంది. చనిపోవడానికి ముందు సెల్ఫీలో తన బాధనంతా రికార్డు చేసింది. దాన్ని హైదరాబాద్లోని సోదరుడికి పంపి.. తాను కడతేరింది. 'నేను ఇక జీవించలేను తమ్ముడూ. అమ్మా, నాన్న, పిల్లలను బాగా చూసుకో. నీవు బాగా చదువుకో బాబూ' అంటూ అందులో కన్నీళ్లు పెట్టుకొంది. సెల్ఫీ చూసిన తమ్ముడు విజయవాడకు వచ్చేసరికి మృతదేహమై హసన్బీ కనిపించింది. అక్క మృతదేహాన్ని చూసిన తమ్ముడు బోరున విలపించాడు.