మిస్టరీగా మారిన ఎంబీఏ విద్యార్థిని గౌతమి మృతి... ఎవరిదా సఫారీ కారు?
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని గౌతమి మృతి మిస్టరీగా మారింది. నరసాపురం - పాలకొల్లు రోడ్లో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌతమి మృతి చెందింది. అయితే ఈ ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని గౌతమి మృతి మిస్టరీగా మారింది. నరసాపురం - పాలకొల్లు రోడ్లో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌతమి మృతి చెందింది. అయితే ఈ ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం గౌతమి స్కూటీని ఢీకొట్టిన కారు వైజాగ్ రిజిస్ట్రేషన్తో ఉండటమే.
వాస్తవానికి ఏంబీఏ పూర్తి చేసిన గౌతమి మూడు నెలలుగా విశాఖపట్నంలో గ్రూప్-2 పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది. సంక్రాంతి పండుగకు ఇంటికొచ్చింది. మరో రెండు రోజుల్లో విశాఖ వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బుధవారం రాత్రి సోదరి పావనితో కలసి స్కూటీపై పాలకొల్లు వెళ్లింది. తిరిగి వస్తుండగా... వెనుక నుంచి టాటా సఫారీ కారు ఢీకొంది.
ఈ ఘటనలో వీరి ద్విచక్రవాహనం పంట కాల్వలోకి దుసుకుపోయింది. ఘటన స్థలంలోనే గౌతమి కుప్పకూలగా... వెనుక కుర్చున్న పావనినీ సఫారీ కారు 100 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ఈ క్రమంలో అదుపుతప్పిన వాహనం ప్రధాన పంట కాల్వలోకి దూసుకుపోయింది. అందులో ఉన్న వ్యక్తులు పరారయ్యారు.
రక్తపుమడుగులో పడి ఉన్న అక్కాచెల్లెళ్లను 108 వాహనంలో పట్టణానికి తరలించారు. చికిత్స పొందుతూ గౌతమి కొద్దిసేపటికే మృతి చెందింది. తొలుత ఈ ప్రమాదానికి కారణం.. వాహనం అతివేగమేనని భావించారు. ఢీ కొన్న వాహనం రిజిస్ట్రేషన్ ఏపీ 31ఏక్యూ 0366 నెంబర్. ఇది విశాఖపట్నానికి చెందింది కావడంతో ఈప్రమాదం పెద్ద మిస్టరీగా మారింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు కాల్ లిస్టు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.