1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 14 డిశెంబరు 2021 (19:31 IST)

ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర, కానీ?

44 రోజుల పాటు వంద కిలోమీటర్లు నడిచి వచ్చిన అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద రైతులు పాదయాత్రను ముగించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నగరంలో ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది.

 
మొత్తం 13 కిలోమీటర్ల పాటు పాదయాత్ర కొనసాగింది. తిరుపతిలోని రామానాయుడు కళ్యాణమండపం నుంచి ప్రారంభమైన పాదయాత్ర నగరంలో 13 కిలోమీటర్ల పాటు కొనసాగింది. అలిపిరి చేరుకున్న వెంటనే రైతులందరూ ఆనందం వ్యక్తం చేశారు. జై అమరావతి నినాదాలను కాసేపు పక్కన బెట్టేశారు.

 
గోవిందా..గోవిందా అంటూ గోవిందనామస్మరణలతో అలిపిరి పాదాల వద్దకు వెళ్ళారు. తిరుమల శ్రీవారిని ప్రార్థించారు. టెంకాయలు కొట్టారు. స్వామి రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ శ్రీవారిని ప్రార్థించారు.

 
గత వారం రోజుల పాటు దర్సనంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని టిటిడి అధికారులు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్వామివారి దర్సనానికి సంబంధించి టోకెన్లను మంజూరు చేశారు. మొత్తం 500 మంది అమరావతి రైతులకు 300 రూపాయల సుపథం టోకెన్లను మంజూరు చేశారు.

 
రేపు ఉదయం 10 గంటలకు అలిపిరి పాదాల మండపం మీదుగా నడుచుకుంటూ తిరుమలకు వెళ్లనున్నారు అమరావతి రైతులు. మొత్తం 500 మంది తిరుమలకు వెళ్ళనున్నారు. ఒకేరోజు శ్రీవారిని ప్రార్థించనున్నారు. దీంతో న్యాయస్ధానం టు దేవస్థానం పాదయాత్ర ముగియనుంది.