1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 11 డిశెంబరు 2021 (09:34 IST)

అమ‌రావ‌తి రైతుల‌కు తిరుపతిలో బహిరంగ సభకు నిరాక‌రణ‌; మ‌ళ్ళీ కోర్టుకు!

అమరావతి రాజ‌ధాని కోసం రైతులు చేప‌ట్టిన మ‌హా పాద యాత్ర తిరుపతికి చేరుతోంది. ఈ రోజు పాదయాత్ర శ్రీకాళహస్తి నుంచి మేర్లపాక వరకు కొనసాగనుంది. మధ్యలో ఇసుకగుంట వద్ద భోజన విరామానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీకి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన చేసి రెండేళ్లు పూర్తవుతుంది. సరిగ్గా అదే రోజున తిరుపతిలో పాదయాత్ర ముగించి బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. తొలుత పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించినా, కోర్టుకు వెళ్లటంతో కొన్ని షరతులతో కోర్టు వారి పాదయాత్రకు అనుమతి ఇచ్చింది.
 
 
ఇప్పుడు పాదయాత్ర ముగింపులో భాగంగా 17న తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలకు లేఖ పంపారు. హైకోర్టు కేవలం పాదయాత్ర నిర్వహణకు మాత్రమే అనుమతించిందని, కొవిడ్‌ నిబంధనల మేరకు బహిరంగ సభకు అంగీకరించలేదని అందులో స్పష్టం చేశారు. తిరుపతి నగరంలో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమయ్యే ఆస్కారమున్నందున బహిరంగ సభకు అనుమతివ్వడం లేదని వెల్లడించారు. దీనితో అమ‌రావ‌తి రైతులు మ‌ళ్ళీ కోర్టుకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది.