1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 13 డిశెంబరు 2021 (20:34 IST)

రైతులు మహా పాదయాత్ర: ఒకవైపు హెచ్చరికలు మరోవైపు స్వాగతం

అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టి 43 రోజులవుతోంది. ఇక మిగిలింది రెండురోజులు మాత్రమే. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ పాదయాత్రను ప్రారంభించి నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నారు. అయితే తిరుపతిలో పాదయాత్రను అడుగుపెట్టనీయము.. అడ్డుకుంటామంటూ రకరకాల హెచ్చరికలు జారీ చేశారు.

 
అయితే ఎలాంటి హడావిడి లేకుండా పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. ప్రస్తుతం రామానాయుడు కళ్యాణ మండపం వద్ద అమరావతి రైతులు సేద తీరుతున్నారు. అయితే అమరావతి రైతులను హెచ్చరిస్తూ.. వారికి స్వాగతం పలుకుతూ కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి.

 
మీతో మాకు గొడవలు వద్దు.. మాకు మూడు రాజధానులు కావాలంటూ.. మీకు తిరుపతికి స్వాగతమంటూ అమరావతి రైతులను ఒకవైపు హెచ్చరిస్తూ.. మరోవైపు స్వాగతం పలుకుతూ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. 

 
నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదేవిధంగా వైసిపి నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేశారు. దీన్ని చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. ఎవరో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తిరుపతి ప్రజలు అంటూ రాయడంపై ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 
 
ఇదంతా అధికార పార్టీ నేతల పనేనంటూ అమరావతి రైతులు చెబుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తూ ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.