1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 మే 2025 (13:41 IST)

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు!!

coronavirus
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. బుధవారం నాడు వైజాగ్‌లో ఓ కేసు వెలుగుచూడగా, తాజాగా కడప జిల్లాలో ఓ వృద్ధురాలికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఈ పరిణామంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 యేళ్ల వృద్ధురాలు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్)లో చేరారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆమెను ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు వెల్లడించారు. 
 
వామ్మో... దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది... 
 
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చైనా, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. భారత్‌లో కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓ కరోనా కేసు నమోదైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 257 కరోనా కేసులు నమోదైవున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 
 
విశాఖపట్టణం నగరంలోని మద్దిలపాలెంకు చెందిన 23 యేళ్ల యువతి కార్పొరేట్ ఆస్పత్రిలో 4 రోజుల క్రితం జ్వరంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఇదే నమూనాను విశాఖ కేజీహెచ్‌లోని వైరాలాజీ ప్రయోగశాలలో పరీక్షించి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. 
 
అయితే, ఆమె ఆరోగ్యం నిలకడా ఉన్నందున గురువారం సాయంత్రం ఆస్పత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. అలాగే, ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలకు జిల్లా అధికారులు సూచించారు.