మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జూన్ 2022 (14:33 IST)

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం.. రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా

Farmers
వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం కింద వరుసగా మూడో ఏడాది కూడా బీమా పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి జమచేయనుంది. 2021 ఖరీఫ్‌ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని ప్రభుత్వం అందించనుంది. 
 
సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో మంగళవారం బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జమచేయనున్నట్లు సమాచారశాఖ కమిషనరు టి విజయకుమార్‌రెడ్డి తెలిపారు. 
 
పంట నష్టాల అంచనా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శించి, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోపే పరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోందని అన్నారు. ఇప్పటి వరకూ రైతులకు నేరుగా రూ.1,28,171 కోట్లు లబ్ధి చేకూర్చారన్నారు.  
 
దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పంటల బీమా పథకం కింద 21 రకాల పంటలకు బీమా కల్పిస్తోంది. 
 
9 రకాల పంటలకు సంబంధించి 35.75 లక్షల హెక్టార్లకు బీమా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఏడాది తిరగకుండానే పంటల బీమా సొమ్ములు చెల్లించాలన్న లక్ష్యంతో ఖరీఫ్‌- 2019 సీజన్‌కు సంబంధించి 9.79 లక్షల మంది రైతులకు రూ.1,252.18 కోట్లు చెల్లించింది. 
 
అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం 5.58 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల బకాయిలను కూడా చెల్లించి రైతులకు అండగా నిలిచింది.
 
గత ప్రభుత్వంలో పంట నష్టాల అంచనా అశాస్త్రీయంగా ఉండేది. అయిన వారికే పరిహారం అందేది. రైతన్నలు ప్రభుత్వ ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్ధితి. దళారులను ఆశ్రయించి, లంచాలు ఇస్తే అరకొరగా అందేది. 
 
ఇప్పుడా పరిస్థితి లేదు. చీడ పీడలు, అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాల వల్ల ఏ కష్టమొచ్చినా, ఏ నష్టం జరిగినా ఆదుకోవాలన్న తపనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతులకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తున్నారు.