శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (13:52 IST)

టీడీపీ నేత దేవినేని ఉమ అరెస్ట్.. అశోక్ బాబును కలిసేందుకు వెళ్తే..?

టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం రాత్రి అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ అశోక్ బాబును కలిసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
 
అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో శుక్రవారం ఉదయం అయనను కలిసేందుకు దేవినేని వెళ్లారు. కానీ… పోలీసులు అనుమతించలేదు. వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు దేవినేని. దీంతో పోలీసులు అరెస్ట్ చేయక తప్పలేదు. 
 
మరోవైపు.. ఉదయం కూడా అశోక్ బాబును కలిసేందుకు వెళ్లిన అడ్వకేట్లను కూడా పోలీసులు అనుతించలేదు. గుంటూరు జీజీహెచ్‌లో అశోక్‌బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. 
 
అశోక్ బాబు అరెస్టుపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించిందని ఆరోపించారు. 
 
అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పని చేసినప్పుడు బీకాం చదవకపోయినా తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని మెహర్ కుమార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త, సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 
 
ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక్‌ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా, గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయింది. దీంతో అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ పోలీసులు.