గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (13:37 IST)

జగన్‌ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే: అమర్‌నాథ్‌రెడ్డి

రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. జగన్ రెండేళ్ల పాలనలో రూ.17లక్షల కోట్ల పరిశ్రమలు తరలిపోయాయన్నారు. రాష్ట్రాభివృద్ధి రేటు - 2.58కి, పారిశ్రామికాభివృద్ధి రేటు - 3.26కి దిగజారిందని తెలిపారు.

జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలతోనే పారిశ్రామికాభివృద్ది రేటు మైనస్‌కు చేరిందని వ్యాఖ్యానించారు. పారిశ్రామికాభివృద్ధిలో కీలకపాత్ర వహించే కారిడార్లలో భూసేకరణ 20 శాతం కూడా పూర్తికాలేదని అన్నారు. భూసేకరణకు రూ.50వేల కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.

జగన్ ప్రభుత్వ అసమర్థ విధానాలతో కోటిమంది అసంఘటితరంగ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. రెండేళ్లలో 4.78 లక్షల ప్రభుత్వోద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన 3.81లక్షల వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలేనా? అని ప్రశ్నించారు.

నిరుద్యోగులను మూటలుమోసే కూలీలుగా మార్చిన రేషన్ బండ్ల డ్రైవర్లు, హెల్పర్లను కూడా ప్రభుత్వోద్యోగులుగా చూపడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా లక్షలాది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న జాబ్ కాలండర్ డీఎస్సీ ఎక్కడ అని అమర్‌నాథ్‌రెడ్డి ప్రశ్నించారు.