శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (21:00 IST)

జగన్ దేశంలోనే చరిత్ర సృష్టించారు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో దాదాపు 31 లక్షల మందికి ఇళ్ళపట్టాలు పంపిణీ చేయడం, తొలి విడతలో 15 లక్షల మందికి పక్కాఇళ్ళు నిర్మించి ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్ దేశంలోనే  చరిత్ర సృష్టించారని కృష్ణాజిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రానున్న రెండు, మూడేళ్ళలో ఈ రాష్ట్రంలో పూరిగుడిసెల్లో వుండే పేదవారే వుండరని అన్నారు. ఈ లక్ష్యంతోనే సీఎం వైయస్ జగన్ ముందుకు వెడుతున్నారని అన్నారు.

ఈ రాష్ట్రంలో 3648 కిలోమటర్ల పాదయాత్రలో అనేక వర్గాలతో ఆనాడు వైయస్ జగన్ మమేకమయ్యారని అన్నారు. వివిధ వర్గాల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని దగ్గర చేయాలనే తపనతోనే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 

ఎన్నికలు అయిన ఏడాదిన్నర సమయంలోనే తొంబై శాతం హామీలను నెరవేర్చిన సీఎంగా ఈ దేశ చరిత్రలోనే  వైయస్ జగన్ కొత్త రికార్డును సృష్టించారని అన్నారు. 2014లో ఆరు వందల హామీలు, వంద పేజీల మేనిఫేస్టోతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు.

చంద్రబాబు అధికారంలోకి రాగానే మూడు లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసివేసి, వారి ఉసురు పోసుకున్నారని విమర్శించారు. అదే జగన్ గారు సీఎం కాగానే దాదాపు నాలుగు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. అయిదేళ్ళ పాలనలో చంద్రబాబు అటు రైతులకు రుణమాఫీ చేయకుండా, ఇటు డ్వాక్రా మహిళలకు రుణాలు, వడ్డీ మాఫీ చేయకుండా దగా చేశారని అన్నారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఆరు వందల హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, మాట చెబితే దాని మీద నిలబడతాడనే నమ్మకం ప్రజల్లో కలిగించాలనే ధ్యేయంతో సీఎం వైయస్ జగన్  పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ రోజు ఇక్కడ రెండు కాలనీల వారికి పట్టాల పంపిణీ చేస్తున్నారని అన్నారు. జగన్ గారు చేసిన 3648 కిలోమీటర్ల పాదయాత్రకు స్పూర్తిగా జగనన్న పాదయాత్ర కాలనీ పేరుతో 3648 మంది పట్టాలు పంపిణీ చేయడం ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు.

ఇళ్లపట్టాల పంపిణీకి సైతం చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు కల్పించారని అన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో యాబై వేల మందికి పట్టాలు ఇవ్వాలని భావిస్తే, కోర్ట్‌కు తన మనుషులను పంపి సామాజిక అసమతూల్యత ఏర్పడుతుందని అడ్డుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ఉగాదికి ఇవ్వాల్సిన పట్టాలు ఆలస్యం అయి, ఈ రోజు ఇస్తున్నామంటే దానికి కారణం చంద్రబాబు చేసిన కుట్రలే కారణమని మండిపడ్డారు. నిత్యం పేదల కోసం తపిస్తూ, ఈ రాష్ట్రంలో అందరికీ మంచి విద్య, వైద్యం, సంక్షేమం అందాలని కోరుకుంటున్న వైయస్ జగన్ కి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.