1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (12:04 IST)

జనసేనకు 8 వసంతాలు - నేడు ఆవిర్భావ దినోత్సవం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని, తొమ్మిదవ యేటలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో భారీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా, వీర మహిళలు కూర్చొనేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచేశారు. 

కాగా, ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జనసైనికులకు దిశానిర్దేశం చేసేలా ఈ సభ ఉంటుందని, గత రెండున్నరేళ్లలో ఏమేం జరిగాయి? ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారు? ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కొన్నారు? భావితరాల వారికి మెరుగైన భవిష్యత్ అందించగలం? వంటి అనేక అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. 
 
అయితే, ఈ ఆవిర్భావ వేడుకలకు వచ్చేవారికి పోలీసులతో పాటు పాలకుల నుంచి అనేక ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇది మా హక్కు అని చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది మన ఆవిర్భావ దినోత్సవం. ఇది మన హక్కు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు అని పవన్ పునరుద్ఘాటించారు. 
 
మఖ్యంగా, గతంలో తమపై చేసిన విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ, సందేహాలు వ్యక్తం చేసిన వారికి రేపు సభాముఖంగా సమాధానం చెబుతానని పవన్ వెల్లడించారు. ఈ సభావేదికకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టామని, ఆయన స్ఫూర్తిగానే సభ సాగుతుందని తెలిపారు.