శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (16:52 IST)

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రాజకీయ నేత కరోనా వైరస్ బారినపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా సోకింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపుల పాయలో పర్యటించనున్నారు. 
 
ఈ కార్యక్రమానికి హాజరయ్యే వైఎస్ కుటుంబ సన్నిహితులు, మీడియా ప్రతినిధులకు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి హోం ఐసోలేషన్‌‌కు వెళ్లారు. తన వెంట గత వారంరోజుల నుంచి తిరుగుతున్న వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.
 
ఇదిలావుండగా, ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొన్నిరోజుల నుంచి ప్రతిరోజూ సగటున 10వేల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 10,548 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,14,164 చేరింది. 
 
ప్రస్తుతం 97,681 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,796 మంది కరోనాతో మృతి చెందారు. 24 గంటల్లో 8,976 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 36,03,345 శాంపిల్స్‌ను పరీక్షించారు.